కాంగ్రెస్, జేడీఎస్ కు సవాళ్లు, హామీలు, కుమారస్వామి యూటర్న్: 2019 లోక్ సభ ఎన్నికల్లో దెబ్బ !
బెంగళూరు: కర్ణాటకలో బుధవారం అధికారంలోకి వస్తున్న జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి పలు సవాళ్లు ఎదురౌతున్నాయి. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అంతసాఫీగా కొనసాగే అవకాశం లేదని స్పష్టంగా కనపడుతోంది. హెచ్.డి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే చర్చ మొదలైయ్యింది. రైతుల రుణమాఫీ విషయంలో అప్పుడే కుమారస్వామి యూటర్న్ తీసుకున్నారు.
Recommended Video
రెండు మేనిఫెస్టోలు
ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్, జేడీఎస్ వేర్వేరుగా పోటీ చేశాయి. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తాము అధికారంలోకి వస్తే మేము విడుదల చేసిన మేనిఫెస్టోలోని అన్నీ హామీలు నెరవేర్చుతామని వేర్వేరుగా హామీలు గుప్పించారు.
హామీలపై సందేహం
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని హామీలు, జేడీఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని హామీలు వేర్వేరుగా ఉన్నాయి. ఇప్పుడు రెండు పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోల్లోని హామీలు ఎంతవరకూ అమలు చేస్తారు అనే సందేహం మొదలైయ్యింది.
కాంగ్రెస్-జేడీఎస్ రాజీ !
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం సవ్యంగా ముందుకుసాగడానికి కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు విడుదల చేసిన రెండు మేనిఫెస్టోల్లోని ప్రముఖ హామీలను ఎంపిక చేసి అమలు చెయ్యాలని ఇరు పార్టీల నాయకులు ఆలోచిస్తున్నారని సమాచారం.
2019 లోక్ సభ ఎన్నికలు
2019 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక్క ఏడాదిలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఎన్ని హామీలు నెరవేర్చుతుందో వేచిచూడాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే 2019 లోక్ సభ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీ ఇంకా పుంజుకునే అవకాశం ఉంది.
సీఎంకు సవాల్
కర్ణాటక ముఖ్యమంత్రి అవుతున్న హెచ్.డి. కుమారస్వామి ముందు ఓ పెద్ద సవాలు ఉంది. కర్ణాటకలోని ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తామని కుమారస్వామీ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే రెండు రోజుల క్రితం ప్రభుత్వ బ్యాంకుల్లో రూ. 50,000 వరకు ఉన్న రైతు రుణాల మాఫీ విషయంలో ఆర్థిక నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కుమారస్వామి యూటర్న్ తీసుకున్నారు. మొత్తం మీద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు 2019 లోక్ సభ ఎన్నికల్లో నష్టపోయే అవకాశం ఉందని సమాచారం.