న్యూ ఇయర్ వేడుకలపై కరోనా దెబ్బ: దేశంలోని ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ, ఆంక్షలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు అనేక పండగలు సంబరంగా జరుపుకోకుండానే ముగిశాయి. ఇప్పుడు నూతన సంవత్సర వేడుకలపైనా ఈ మహమ్మారి తన ప్రభావాన్ని చూపింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాయి ప్రభుత్వాలు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచనల నేపథ్యంలో పలు రాష్ట్రాలు అందుకు తగినట్లుగా వ్యవహరిస్తున్నాయి.
Recommended Video

దేశ రాజధానిలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలను విధించింది. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో ఢిల్లీ వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. గురువారం, శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి సమయంలో ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడరాదని స్పస్టం చేసింది.
రాత్రి 8 గంటల తర్వాత ఇండియా గేట్, రాజ్పత్, విజయ్ చౌక్, పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో సాధారణ ప్రజలకు అనుమతి నిరాకరించింది. కన్నౌట్, మార్కెట్ ప్రాంతాల్లో కూడా ఆంక్షలు విధించినట్లు ఢిల్లీ చీఫ్ సెక్రటరీ విజయ్ దేవ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రాత్రి కర్ఫ్యూ ఉన్నప్పటికీ.. అంతర్రాష్ట్ర ప్రయాణాలు, సరుకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని పోలీసులు స్పష్టం చేశారు.

వాణిజ్య రాజధాని ముంబైలోనూ ఆంక్షలే
దేశ వాణిజ్య రాజధానిలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు కూడా నూతన సంవత్సర వేడుకలపై కఠిన ఆంక్షలు విధించింది. ముంబైలో గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించినట్లు ముంబై పోలీస్ ఉన్నతాధికారి చైతన్య తెలిపారు. రెస్టారెంట్లు, పబ్లు, బార్లు, బీచుల్లో ఎలాంటి పార్టీలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. ముంబై నగర వ్యాప్తంగా డ్రోన్లతో నిఘా పెట్టినట్లు తెలిపారు.

హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లోనూ..
ఇక దేశంలో ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి పార్టీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో బేగంపేట ఫ్లైఓవర్ మినహా అన్ని ఫైఓవర్లపై వాహనాల రాకపోకలను గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 5 గంటలకు వరకు మూసివేశారు. ఇకబెంగళూరులో ఈ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications