నిర్భయ కేసు: ఏడేళ్ల తర్వాత న్యాయం .. ఉరి కంబానికి వేలాడిన నలుగురు నిందితులు
న్యూఢిల్లీ: నిర్భయ ఘటనలో నిందితులకు ఎట్టకేలకు ఉరిశిక్ష పడింది. తాను మృతి చెందిన ఏడేళ్లకు నిర్భయ ఆత్మ శాంతించింది అని చెప్పొచ్చు. నిర్భయ తల్లిదండ్రులు ఏడేళ్ల పాటు కోర్టుల్లో చేసిన పోరాటానికి ఫలితం దక్కింది. చివరి నిమిషం వరకు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ ఘటన నిందితులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మార్చి 20 సరిగ్గా 5:30 గంటలకు నలుగురు నిందితులు ఉరితీయబడ్డారు. అంతకుముందు జైలుకు మెజిస్ట్రేట్ చేరుకున్నారు. వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించారు. నలుగురూ ఫిట్గా ఉన్నారని డాక్టర్ చెప్పడంతో ఇక ఇతర కార్యక్రమాలు ముందుకు సాగాయి.
ఇక తీహార్ జైలు వద్ద సందడి నెలకొంది. పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు. బయట గట్టిగా నినాదాలు చేస్తూ నిలబడ్డారు. ఇక తీహార్ జైలు లోపల నిందితులు ఉరికంబం వద్దకు చేరుకున్నారు. అప్పటికే డమ్మీ ట్రయల్ కూడా తలారి పవన్ జలాద్ నిర్వహించారు. జైలు నెంబర్ 3లో నిర్భయ నిందితులను ఉరితీయడం జరిగింది. 10 నిమిషాలు పాటు గాల్లో కొట్టుకున్న నిందితులు చివరికి ప్రాణాలు కోల్పోయారు. ఇక అరగంట పాటు నిందితుల మృతదేహాలు ఉరికంబానికి అలానే వ్రేలాడుతాయని అధికారులు చెప్పారు. ఇక నిందితుల ఉరికి సంబంధించి రెసిడెంట్ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ వివరాలన్నీ జైలు సూపరింటెండెంట్ ఐజీకి అందజేశారు.
నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలు కావడంపై నిర్భయ తల్లి ఆశాదేవీ హర్షం వ్యక్తం చేశారు. ఆలస్యమైనా తన కూతురుకు న్యాయం జరిగిందని ఆశాదేవీ చెప్పారు. ఈ ఏడేళ్ల కాలంలో దేశం మొత్తం తన కుటుంబం వెంట ఉన్నందుకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. న్యాయం చేసిన కోర్టులకు, నిందితులకు క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఆశాదేవీ ధన్యవాదాలు తెలిపారు. తన కూతురు ఆత్మకు ఏడేళ్ల తర్వాత శాంతి లభించిందని ఆశాదేవి చెప్పారు.