Nirbhaya case: కోర్టులో కన్నీటిపర్యంతమైన నిర్భయ తల్లి, న్యాయమూర్తి ఏం చెప్పారంటే..?
న్యూఢిల్లీ: తన కూతురుపై హత్యాచారం జరిగి ఏడేళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని నిర్భయ తల్లి ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ దోషులను వెంటనే ఉరితీయాలంటూ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఆమె ఢిల్లీ కోర్టులో బుధవారం కన్నీటిపర్యంతమయ్యారు. దోషులను శిక్షించాలంటూ రెండు చేతులతో న్యాయమూర్తులకు దండంపెట్టారు.

దోషులను వెంటనే ఉరితీయండి..
‘మా హక్కుల గురించి కూడా ఆలోచించండి. మేమూ మనుషులమే. ఏడేళ్లయింది. నా కూతురికి ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది. మీకు చేతులెత్తి మొక్కుతున్నా.. దయచేసి దోషులను ఉరితీయండి' అని నిర్భయ తల్లి ఆశాదేవి కోర్టులో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నిర్భయ దోషుల ఉరితీతకు కొత్త తేదీని నిర్ణయించవచ్చని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషుల శిక్ష అమలుకు కొత్త డెత్ వారెంట్లు జారీ చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు, ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.

పవన్ గుప్తాకు కొత్త లాయర్..
ఈ క్రమంలో బుధవారం ఢిల్లీ కోర్టు పిటిషన్లపై విచారణ జరిపింది. కాగా, తన తరపున వాదించేందుకు న్యాయవాది ఎవరూ లేరంటూ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా కోర్టుకు విన్నవించాడు. దీంతో అతడికి తక్షణమే కోర్టు న్యాయ సహాయం అందించింది. ఎంపానెల్డ్ న్యాయవాదుల జాబితాను ఇచ్చి లాయర్ను ఎంచుకోవాలని సూచించింది. అనంతరం డెత్ వారెంట్ల పిటిషన్లపై విచారణ గురువారానికి వాయిదా వేసింది.
Recommended Video

నమ్మకం పోతోందంటూ నిర్భయ తల్లి..
ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి తీవ్ర అసంతృప్తి గురయ్యారు. కోర్టులోనే ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. వ్యవస్థపై తమకు నమ్మకం పోతోందని అన్నారు. ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు దోషులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, న్యాయస్థానం వీటిని ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు దోషి అయిన పవన్ గుప్తాకు కొత్త లాయర్ను ఏర్పాటు చేస్తే ఆ న్యాయవాది కేసును ఫైల్ చేయడంలో మరింత ఆలస్యం చేస్తారని వాపోయారు.

కోర్టులో కన్నీటిపర్యంతమైన ఆశాదేవి.. న్యాయమూర్తి ఏం చెప్పారంటే..?
‘బాధితురాలిని తల్లిని నేను. నా హక్కుల గురించి ఆలోచించరా?' అని నిర్భయ తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి స్పందించారు. ‘మీ హక్కుల గురించి మా అందరికీ తెలుసు. దానికి అనుగుణంగానే విచారణ కొనసాగుతోంది. అయితే, ప్రతి దోషికీ తన చివరి శ్వాస వరకు న్యాయ సహాయం పొందే అర్హత ఉంది' అని జడ్జీ వ్యాఖ్యానించారు. ప్రతీ ఒక్కరికి హక్కులున్నాయని.. అందుకే దోషులకు న్యాయ సహాయం ఇవ్వకపోతే అది అన్యాయం చేసినట్లే అవుతుందని చెప్పారు. న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకునేందుకు నిర్భయ దోషులు ముకేష్ కుమార్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ కుమార్ శర్మ(26), అక్షయ్ కుమార్(31)లకు ఢిల్లీ హైకోర్టు వారం గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications