టీటీడీ పాలకమండలిలో నీతాఅంబానీ: శివాజీ, దర్శకేంద్రుడు కూడా
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీకి చోటు దక్కే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ అటవీ, సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి శనివారం తెలిపారు.
తిరుమల తిరుపది దేవస్థఆనంలో అవినీతి అధికారుల పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, టీటీడీ బోర్డులో 30 మంది పేర్లను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అందులో నీతా అంబానీ పేరు కూడా ఉండవచ్చునని అంటున్నారు.
టీటీడీలో బోర్డులో సభ్యుడిగా ఉండేందుకు దాదాపు 1,200 దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో నుండి 30 మంది పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నారు. వారిలో నీతా అంబానీ వంటి వారి ఎంపిక ఇప్పటికే అయిపోయిందని అంటున్నారు.
నీతా అంబానీతో పాటు ప్రముఖ సినిమా దర్శకులు కే రాఘవేంద్ర రావు, నటుడు శివాజీ, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి జి భానుప్రకాశ్ రెడ్డి ఉండవచ్చునని తెలుస్తోంది. పలువురి పేర్లను భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, కేంద్రమంత్రి సదానంద గౌడ తదితరులు రికమండ్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.
టీటీడీ చైర్మన్, మెంబర్స్ కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుగుతుందనే వాదనలు ఉన్నాయి. ఇప్పటికే టీటీడీ చైర్మన్ పదవి కోసం చదలవాడ కృష్ణమూర్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. టీటీడీలో చైర్మన్ సహా 15 మంది సభ్యులు ఉంటారు. అయితే, ఈ సంఖ్యను 18కి పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నుండి కొందరికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు.