నీతి అయోగ్ కు రాజీవ్ రాజీనామా : ఆ స్థానంలో సుమన్ బేరీ - కేంద్రం నిర్ణయం..!!
కేంద్రంలో కీలక వ్యవస్థ అయిన నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ రాజీనామా చేసారు. ప్రస్తుతం నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ గా కొనసాగుతున్న రాజీవ్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఆయన స్థానంలో కేంద్రం కొత్త వైస్ ఛైర్మన్ ను నియమించింది. ఆయన స్థానంలో సుమన్ బెరీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్కుమార్ ఈనెల 30 వరకు పదవిలో కొనసాగనున్నారని ఆ తర్వాత కొత్త ఉపాధ్యక్షుడిగా సుమన్ బెరీ మే 1 నుంచి బాధ్యతలు తీసుకుంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
అయిదేళ్లు పదవిలో కొనసాగిన రాజీవ్
2017 ఆగస్టులో అప్పటి నీతి ఆయోగ్ వైస్చైర్మన్గా అరవింద్ పనగరియా రాజీనామా చేయడంతో రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. లక్నో యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేసిన రాజీవ్ కుమార్.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డీఫిల్ పూర్తి చేశారు. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సీనియర్ ఫెలోగా ఉన్నారు. వ్యవసాయ రంగం, పెట్టుబడుల ఉపసంహరణ వంటి నిర్ణయాల్లో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా రాజీవ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. రాజీవ్ కుమార్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఆర్దికవేత్త సుమన్ కే బేరీ నియామకం
కొత్తగా నీతి ఆయోగ్ వైస్చైర్మన్గా నియమితులైన సుమన్ కే బెరీ ఇంతకుముందు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) డైరెక్టర్ జనరల్ (చీఫ్ ఎగ్జిక్యూటివ్)గా పని చేశారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడిగానూ సేవలందించారు. దిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్లో విజిటింగ్ ఫెల్లోగా ఉన్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో, స్టాటిస్టికల్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానానికి సంబంధించి సాంకేతిక సలహా కమిటీలోనూ సభ్యుడిగా పనిచేశారు.
2024 ఎన్నికల ముందు కీలక బాధ్యతల్లో
2014 లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అప్పటి వరకు ఉన్న ప్రణాళికా సంఘం స్థానంలో నీతి అయోగ్ ను ప్రవేశ పెట్టారు. దీనికి తొలి ఉపాధ్యక్షుడిగా అరవింద్ పనగరియా వ్యవహరించారు. ఆ తరువాత ఆయన స్థానంలో 2017 నుంచి రాజీవ్ కుమార్ ఈ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. రాజీవ్ కుమార్ పలు రాష్ట్రాల్లో స్వయంగా పర్యటించి..క్షేత్ర స్థాయిలో అంశాలను స్వయంగా పరిశీలించారు. తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పలు పథకాల తీరును ఆయన స్వయంగా సమీక్షించారు. ఇక, ఇప్పుడు ఆ స్థానంలో నియమితులైన సుమన్ బెరీ భారత ద్రవ్య విధానంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.