మాజీ ఎంపీ కొడుకులకు 30 ఏళ్లు జైలు శిక్ష
న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ అధికారి కుమారుడు నితీష్ కఠారాను ఓ పథకం ప్రకారం హత్య చేశారని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నిందితులు వికాస్ యాదవ్, విశాల్ యాదవ్ కు ఢిల్లీ హై కోర్టు విధించిన జైలు శిక్షను సుప్రీం కోర్టు సమర్థిచింది.
అయితే నిందితులకు విదించిన 30 సంవత్సరాల జైలు శిక్షను తగ్గించే విషయం పరిశీలిస్తామని సుప్రీం కోర్టు చెప్పింది. ఉత్తరప్రదేశ్ మాజీ పార్లమెంట్ సభ్యుడు డీపీ యాదవ్ కుమారులు వికాస్ యాదవ్, విశాల్ యాదవ్. వీరి సోదరి భారతీ యాదవ్.
భారతీ యాదవ్, నితీష్ కఠారా ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే యాదవ్ సోదరులకు వీరు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. 2002 ఫిబ్రవరి నెల 17వ తేదిన భారతీ, నితీష్ ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్ శివార్లలో జరుగుతున్న పెళ్లి పార్టీకి వెళ్లారు.
విషయం తెలుసుకున్న యాదవ్ సోదరులు పెళ్లి పార్టీ దగ్గరకు వెళ్లారు. తరువాత నితీష్ ను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చెయ్యడానికి వీరిద్దరికి సుఖదేవ్ పెహల్వాన్ సహకరించాడు. తరువాత ఢిల్లీ శివార్లలోకి తీసుకు వెళ్లి నితీష్ ను దారుణంగా హత్య చేశారు.
విషయం తెలుసుకున్నపోలీసులు కేసు నమోదు చేసి వికాస్ యాదవ్, విశాల్ యాదవ్, సుఖదేవ్ లను అరెస్టు చేసి జైలుకు పంపించారు. కేసు విచారణ చేసిన మెజిస్ట్రేట్ కోర్టు వికాస్ యాదవ్, విశాల్ యాదవ్, సుఖదేవ్ పెహల్వాన్ లకు జీవిత ఖైదు శిక్ష విదించింది.
నిందితులకు ఉరి శిక్ష విధించాలని నితీష్ తల్లి ఢిల్లీ హై కోర్టులో అర్జీ సమర్పించారు. ఆమె అభ్యర్థన తిరస్కరించిన ఢిల్లీ హై కోర్టు నిందితులకు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది.