నోట్ల రద్దు: మమత ఫోన్ చేస్తే.. నితీష్ ఏం చెప్పారో తెలుసా?
పాట్నా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెద్ద నోట్ల రద్దును మొదటి నుంచీ వ్యతిరేకిస్తుండగా.. బీహార్ సీఎం నితీష్ కుమార్ మాత్రం నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతు పలికారు. నల్లధనం, నకిలీ కరెన్సీని పూర్తిగా నిర్మూలించడంలో మోడీ తీసుకున్న నిర్ణయం గొప్పదని పేర్కొన్నారు.
కాగా, పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ విపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనమని అడగడానికి మమతా బెనర్జీ.. నితీశ్కుమార్కి ఫోన్ చేశారు. దానికి ఆయన ఏం సమాధానమిచ్చారంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అంగీకరించారు, ఇక దీనిపై నిరసన చేపట్టినా ప్రయోజనం లేదని స్పష్టం చేశారు.

అందుకే నోట్ల రద్దును వ్యతిరేకించకుండా మద్దతు తెలుపుతున్నానని సీఎం నితీశ్ తేల్చి చెప్పారు. మంగళవారం సాయంత్రం ఆర్జేడీ ఎమ్మెల్యేలతో ఆయన ఈ విషయం చెప్పారు. కాగా, బుధవారం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో పాట్నాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తుండగా, అందులో నితీశ్ పార్టీకి సంబంధించిన వారెవరూ పాల్గొనడం లేదు.
కానీ, రాష్ట్రీయ జనతా దళ్( ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం సాయంత్రం మమతను కలిసినప్పుడు తమ పార్టీ తరఫున ప్రతినిధి హాజరవుతారని తెలిపారు. అయితే రాష్ట్ర మంత్రులైన ఆయన కుమారులు మాత్రం ఇందులో పాల్గొనడం లేదు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం మమతా బెనర్జీ మంగళవారం లక్నోలో ర్యాలీ నిర్వహించారు. అక్కడ అఖిలేశ్ ప్రభుత్వం తరఫున మమతకు స్వాగతం పలకడానికి రాష్ట్ర మంత్రి హాజరయ్యారు. నితీశ్ అలా ఎవరినీ పంపకపోగా తమ పార్టీ సీనియర్ నేతలెవరూ నిరసన కార్యక్రమంలో పాల్గొనబోరని స్పష్టం చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications