బీజేపీ దెబ్బ: మెట్టు దిగిన శశికళ, పన్నీరుకు తప్పిన గండం!
ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు పదవీ గండం లేనట్లేనా? ప్రస్తుతానికి శశికళ తన 'ముఖ్య' ఆశలను పక్కన పెట్టేశారా? అంటే అలాగే కనిపిస్తోందని అంటున్నారు.
చెన్నై: ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు పదవీ గండం లేనట్లేనా? ప్రస్తుతానికి శశికళ తన 'ముఖ్య' ఆశలను పక్కన పెట్టేశారా? అంటే అలాగే కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటికే పార్టీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శశికళ చిక్కులు వచ్చి పడుతున్నాయి.
పార్టీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన శశికళ.. ఎప్పుడైనా ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోవచ్చుననే ప్రచారం సాగింది. పార్టీ ముఖ్య నేతలు కూడా.. తమ పార్టీ రూల్ ప్రకారం పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి ఒక్కరే ఉండాలని చెబుతూ వచ్చారు.
కానీ ఇటీవల వారి మాటలో వాడి తగ్గినట్లుగా కనిపిస్తోంది. మొన్నటి దాకా పలువురు నేతలు శశికళ సీఎం కావాలని మీడియాకు ఎక్కారు. ఇప్పుడు అది కనిపించడం లేదు. పార్టీలో, బయటా ఇబ్బందుల దృష్ట్యా ఆమె 'ముఖ్య' పదవిపై తగ్గి ఉండవచ్చునని అంటున్నారు.
ప్రాణాలకు ముప్పు: శశికళకు ఫ్యామిలీ చిక్కు, ఎప్పుడే రివర్స్
జయ మృతి అనంతరం బీజేపీ కూడా నిన్నటి దాకా అన్నాడీఎంకే ద్వారానే ఎదగాలని చూసింది. ఇప్పుడు కూడా చక్రం తిప్పేందుకు అదును చూసుకొని కూర్చుంది. ఇంటా, బయట ఇబ్బందుల నేపథ్యంలో.. తొలుత అంతా సర్దుబాటు చేసేందుకు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.
దీపా జయకుమార్ నుంచి..
ఓ వైపు దీపా జయకుమార్.. తాను రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్నారు. ఆమె పార్టీ పెట్టే అవకాశాలున్నాయి. జయలలితకు అసలైన వారసురాలిని తానే అని చెబుతున్నారు. మరోవైపు పార్టీలో శశికళ కుటుంబ ఆధిపత్యం ఉందని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఎంజీఆర్ దత్తపుత్రిక రంగంలోకి దిగుతున్నారు.
బీజేపీ ప్రత్యేక దృష్టి
ఇక, జయలలిత మృతి తర్వాత బీజేపీ తమిళనాడు పైన ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. తొలుత శశికళ, పన్నీరు సెల్వం ద్వారా రాజకీయం నెరిపే ప్రయత్నాలు చేసింది. శశికళ వ్యూహంలో నిన్న చిత్తైనా.. తమిళనాడులో తమ పార్టీ ఎదగాలంటే ఇదే సమయమని భావిస్తోంది. కాబట్టి తన ప్రయత్నాలు మానడం లేదు. ప్రతిపక్ష డిఎంకే కూడా శశికళకు సవాల్గానే మారింది.
శశికళ వేచి చూస్తారా?
ఇన్ని సమస్యల మధ్య ఇప్పుడే ముఖ్యమంత్రి పదవి వద్దని వాయిదా వేసుకున్నట్లుగా భావిస్తున్నారు. అయితే, ఆమె 2021 ఎన్నికల వరకు వేచి చూస్తారా లేదా అంతా సర్దుకున్నాక తిరిగి ముఖ్యమంత్రి పదవి పైన దృష్టి పెడతారా చూడాల్సి ఉందని చెబుతున్నారు.
పన్నీరు సెల్వం ఊపిరిపీల్చుకోవచ్చు
మొత్తానికి ఇంటా, బయటా పరిస్థితుల నేపథ్యంలో పన్నీరు సెల్వం ప్రస్తుతానికి ఊపిరిపీల్చుకోవచ్చునని అంటున్నారు. ఇందుకు, శశికళ సోదరుడు, భర్త వ్యాఖ్యలే నిదర్శనం అంటున్నారు.
బీజేపీ సహా పలువురి దాడి నుంచి తట్టుకున్నాకే..
తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, ఆ ఆటలు సాగనివ్వమని వారు అంటున్నారు. అలాగే, తమకు ప్రాణభయం కూడా ఉందన్నారు. ముఖ్యమంత్రి పదవిపై మాట్లాడుతూ.. పన్నీరు సమర్థవంతంగానే పని చేస్తున్నారని, ఇప్పటికిప్పుడు ఆయనను మార్చే ఉద్దేశ్యం లేదని చెప్పారు. తద్వారా పన్నీరుకు ఇప్పుడు వచ్చిన ఇబ్బంది లేదని, అదే సమయంలో.. తమ ద్వారా ఎదగాలనుకున్న.. తమ పార్టీని టార్గెట్ చేసుకున్న బీజేపీని, అలాగే పార్టీలో సమస్యల పైన శశికళ ప్రస్తుతం దృష్టి సారిస్తున్నట్లుగా ఉందంటున్నారు.