ఢిల్లీలో ఆరు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఖాళీ: దయనీయ పరిస్థితిలో రోగులు, వైద్యుల ఆవేదన
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండగా.. ఆస్పత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. దీంతో చాలా ఆస్పత్రులు రోగులకు చికిత్స అందించలేకపోతున్నాయి. ప్రాణాలను రక్షించేందుకు తమవంతుగా ప్రయత్నిస్తున్నామని.. ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో కళ్ల ముందు ప్రాణాలు పోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయులుగా ఉంటున్నామని పలువురు వైద్యులు కన్నీరుపెట్టుకుంటున్నారు.
కోర్టుల ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వం చొరవతో ఢిల్లీలోని పలు ప్రముఖ పెద్ద ఆస్పత్రులకు ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ రాష్ట్రంలోని అనేక ఆస్పత్రులు ఆక్సిజన్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆ ఆస్పత్రుల్లో ఉన్న రోగుల పరిస్థితి దయనీయంగా మారింది.
పలు ఆస్పత్రులు ఆక్సిజన్ లేకపోవడంతో రోగులను చేర్చుకోవడం లేదు. మరికొన్ని ఇతర ఆస్పత్రులకు వెళ్లాలని సూచిస్తున్నాయి. తాజాగా, శాంతి ముకుంద్ ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో రోగుల పరిస్థితి దయానీయంగా మారిందని ఆస్పత్రి సీఈవో సునీల్ సాగర్ మీడియా ముందు భావోద్వేగానికి గురయ్యారు. రోగుల ప్రాణాలను కాపాడలేకపోతున్నామంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
ఢిల్లీలోని చాలా ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. నిత్యం అక్కడ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉన్నప్పటికీ కేవలం 400 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంటోందని తెలిపారు. కాగా, రాష్ట్రంలోని ఆరు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పూర్తిగా అందుబాటులో లేదని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని హైకోర్టు.. కేంద్రాన్ని ఆదేశించిన గంటల్లోనే ఈ ఆరు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఖాళీ కావడం గమనార్హం.
సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, శాంతి ముకుంద్ ఆస్పత్రి, తీరథ్ రామ్ షా ఆస్పత్రి, యూకే నర్సింగ్ హోం, రథి ఆస్పత్రి, సాంటమ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పూర్తిగా ఖాళీ అయ్యిందని ప్రభుత్వం పేర్కొంది. యూపీ, హర్యానాతోపాటు ఒడిశా నుంచి ఆక్సిజన్ తెప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఢిల్లీ సర్కారు తెలిపింది. అయితే, ఉత్తరప్రదేశ్, హర్యానా అధికారులు ఢిల్లీకి వచ్చే ఆక్సిజన్ ట్యాంకర్లను అడ్డుకుంటున్నారని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు.