హైదరాబాద్ దేశ రెండో రాజధాని?: తేల్చేసిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: తరచూ చర్చల్లోకి వచ్చే దేశ రెండో రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే, దేశ రెండో రాజధాని ఏర్పాటుకు ఎలాంటి ప్రణాళిక లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టంచేసింది.
దక్షిణ భారత దేశంలో రెండో రాజధానిగా హైదరాబాద్ను ఏర్పాటుచేసే ప్రణాళిక ఏమైనా ఉందా? అని టీఆర్ఎస్ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్రాజ్ గంగారాం అహిర్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఢిల్లీలో ఆందోళన కల్గించే రీతిలో కాలుష్యం పెరిగిపోతుండటంపై గత వారంలో రాజ్యసభలో చర్చ జరిగింది. ఆ సందర్భంగా అన్నాడీఎంకే ఎంపీ ఎ.నవనీతకృష్ణన్ మాట్లాడుతూ.. ఢిల్లీ గ్యాస్ ఛాంబర్గా మారిపోతోందని, పార్లమెంట్ సమావేశాలను దక్షిణ భారతదేశానికి మార్చాలని సూచించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ హైదరాబాద్ను రెండో రాజధానిగా చేసే ప్రతిపాదన ఏమైనా కేంద్రం వద్ద ఉందా? అని ప్రశ్నవేశారు. స్పందించిన కేంద్రమంత్రి అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.