రూ. వంద కోట్ల విలువైన వజ్రాల నోయిడా ఇంజనీర్ సస్పెన్షన్
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నోయిడా ఇంజనీర్ ఇన్ చీఫ్ యాదవ్ సింగ్ను సోమవారం సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆదేశాల మేరకు ఆయనను ఉన్నతాధికారులు ఆయన సస్పెండ్ చేశారు. యాదవ్పై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించారు. నోయిడా అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి విచారణ జరుపుతారని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
యాదవ్కు చెందిన ఢిల్లీ, నోయిడా, ఘజియాబాదుల్లోని నివాసాల్లో, కార్యాలయాల్లో నవంబర్ 27వ తేదీన సోదాలు నిర్వహించన విషయం తెలిసిందే. వంద కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, పది కోట్ల రూపాయల నగదు ఒకేచోట చూసిన ఆదాయపు పన్ను అధికారులు దిమ్మతిరిగిపోయారు. ఎనిమిది బ్యాగుల్లో నింపిన డబ్బుకట్టలు ఆ ఇంటి ఆవరణలోని ఆడీ కారులో చూసిన అధికారులు నోళ్లు వెళ్లబెట్టారు.
ఇంట్లో ఎంత ఉందోనన్న అనుమానంతో లోపలికి వెళ్లి వెదికితే.. ఏకంగా 2 కిలోల వజ్రాలు దొరకడంతో అధికారులకు నోట మాట రాలేదు. వీటి విలువ రూ.100 కోట్లదాకా ఉంటుందని అంచనా వేశారు. ఇంతకూ ఇదంతా ఏ బడా వ్యాపారవేత్త ఇంట్లోనో, అవినీతి రాజకీయ నేత నివాసంలోనో దొరికిన సంపద కాదు, ఉత్తరప్రదేశ్లోని ఒక ఇంజనీరుగారి నివాసంలో లభ్యమైంది. నోయిడాలో నివసించే ఈ ఘనత వహించిన ఇంజనీరు పేరు యాదవ్ సింగ్.
నోయిడా అథారిటీ చీఫ్ ఇంజనీర్గా అతను పనిచేస్తున్నాడు. ఆయన భార్య కుసుమలత డిజైనర్ క్లాత్స్ మ్యానుఫాక్చరర్స్ మీను క్రియేషన్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. గురువారం రాత్రి ఆ ఇంజనీర్ గారి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటి శాఖ అధికారులకు దిమ్మి తిరిగే సంపద దొరికింది. పది కోట్ల నగదును ఎనిమిది బ్యాగుల్లో నింపి కారులో పెట్టిన విషయాన్ని ఐటి అధికారులు గుర్తించారు. 130 మంది ఐటి శాఖ అధికారులు, అదే సంఖ్యలో పోలీసులు ఆపరేషన్ చేపట్టిన నోయిడా, ఘజియాబాద్, ఢిల్లీల్లోని 20 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు.
నోయిడాలోని ప్లాట్ల అమ్మకాలను బోగస్ షేర్ హోల్డింగ్ల ద్వారా జరిపారనే ఆరోపణపై ఢిల్లీ, ఎన్సిఆర్ ప్రాంతాల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ షేర్లు కొన్నవారే ప్లాట్లను సొంతం చేసుకున్నారని, గత మూడు నాలుగేళ్లలో ఈ లావాదేవీలన్నీ జరిగాయని డైరెక్టర్ జనరల్ (దర్యాప్తు) కృష్ణ సైనీ చెప్పారు. సోదాలు చేసినప్పుడు 13 లాకర్లను కనిపెట్టామని, వాటిని రెండు మూడు రోజుల్లో తెరిచి, పరిశీలిస్తామని సైనీ తెలిపారు.