జీఎస్టీ వసూళ్లలో ధనిక రాష్ట్రాలకన్నా ముందంజలో ఉన్న పేద రాష్ట్రాలు
న్యూఢిల్లీ: వస్తు మరియు సేవల పన్ను జీఎస్టీ కలెక్షన్లలో బీహార్, ఒడిషా ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ముందువరసలో నిలిచాయి. ఇక్కడ పరిశ్రమలు ఎక్కువగా లేనప్పటికీ పరిశ్రమలు విరివిగా ఉన్న రాష్ట్రాలకంటే మెరుగ్గా జీఎస్టీ కలెక్షన్స్లో ముందున్నాయి. పారిశ్రామిక వాడలుగా ముద్రవేసుకున్న మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు జీఎస్టీ కలెక్షన్స్లో వెనుకంజలోనే ఉన్నాయి.
ఓ ప్రముఖ జాతీయ వార్త సంస్థ సేకరించిన సమాచారం మేరకు పారిశ్రామికేతర రాష్ట్రాల నుంచి అధికంగా జీఎస్టీ కలెక్ట్ చేసిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ముందున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలల్లో జీఎస్టీ కలెక్షన్స్ పడిపోగా ఆ తర్వాత 9శాతంకు పుంజుకుని రూ.3.56 లక్షల కోట్లు కలెక్ట్ చేసినట్లు ఆ వార్తా సంస్థ పేర్కొంది. ఇక కలెక్షన్స్లో తగ్గుముఖం పట్టిన రాష్ట్రాల్లో ఢిల్లీ ముందంజలో ఉంది. ఇప్పటికే 2శాతంకు కలెక్షన్లు పడిపోయాయి. ఏప్రిల్ - జూలై నెలలకు గాను ఢిల్లీ రాష్ట్రం కలెక్ట్ చేసిన జీఎస్టీ కేవలం రూ. 12,700 కోట్లుగానే ఉంది. గతేడాది ఇది రూ. 13వేల కోట్లుగా ఉన్నింది.
ఇక ఈశాన్యరాష్ట్రాల్లో నాగాలాండ్ 39శాతం జీఎస్టీ వసూళ్లు చేయగా, అరుణాచల్ ప్రదేశ్ 35 శాతం, మేఘాలయా 32 శాతం వసూళ్లు చేశాయి. అయితే ఇక్కడ శాతం ఎక్కువగానే ఉన్నప్పటికీ జీఎస్టీ మాత్రం రూ. 370 కోట్లు నుంచి రూ. 680 కోట్లు మధ్యే ఉంది. ఇప్పటికే జీఎస్టీని సవాలుగా తీసుకున్న రాష్ట్రాల్లో మార్పు కనిపిస్తోందని ప్రభుత్వ అధికారులు ఇతర టాక్స్ నిపుణులు చెబుతున్నారు. జీఎస్టీ అమలు చేయబోతున్నట్లు మోడీ సర్కార్ ప్రకటన చేయగానే పరిహారం చెల్లించాలనే డిమాండ్లు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాల నుంచి వచ్చాయి. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి వచ్చే డిమాండ్ను ఉపసంహరించుకోవాలని మోడీ సర్కార్ ఆదేశించడంతో ఆ రాష్ట్రాలు డిమాండ్పై వెనక్కు తగ్గాయి.
ఇక పరిహారం చెల్లింపుల కింద 14శాతం కంటే తక్కువగా వృద్ధి నమోదు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్రం ఐదేళ్లకోసారి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది. అయితే ప్రస్తుత సమాచారం చూస్తే పేద రాష్ట్రాలకు పరిహారం చెల్లించాల్సిన అవశ్యకత కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలన్న ఉద్దేశంతో సాఫ్ట్ డ్రింక్స్, పొగాకు, ఆటోమొబైల్స్పై సుంకం విధించింది కేంద్రం. ఇదిలా ఉంటే ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు అనుకున్న దానికంటే మెరుగ్గా ఉంటాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.