బ్యాంకుల ప్రైవేటీకరణ : ఉద్యోగ భద్రత ఉంటుందా? అంతా ప్రైవేట్ పరమేనా? క్లారిటీ ఇచ్చిన నిర్మలా
పెట్టుబడుల ఉపసంహరణతో ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న ఉద్దేశంతో మోదీ సర్కార్ ప్రైవేటీకరణ వైపు వేగంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. బ్యాంకింగ్ రంగంలోనూ రెండు బ్యాంకులను ప్రైవేటీకరించబోతున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెండు రోజుల బ్యాంకు సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణపై మంగళవారం (మార్చి 16) కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టానికి ప్రధాన కారణాలివే, ప్రైవేటీకరణ అందుకే: వైసీపీ ఎంపీకి నిర్మలా సీతారామన్
అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించం : నిర్మలా
అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని నిర్మలా సీతారమన్ స్పష్టం చేశారు. 'ప్రస్తుతం దేశంలో పలు బ్యాంకులు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిల్లో కొన్ని బాగా పనిచేస్తుంటే... మరికొన్ని ఫర్వాలేదు అన్నట్లుగా నడుస్తున్నాయి. అయితే ఇవి పోషించబోయే పాత్ర చాలా కీలకమైనది... అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎస్బీఐ తరహాలో దేశ అవసరాలను తీర్చగల బ్యాంకులు మనకు కావాలి.' అని సీతారామన్ పేర్కొన్నారు.
ఉద్యోగుల ప్రయోజనాలపై...
పబ్లిక్ ఎంటర్ప్రైజ్ పాలసీ ఆధారంగా ప్రైవేటీకరణ ప్లాన్ను అమలుచేస్తున్నట్లు సీతారామన్ తెలిపారు. ఆ పాలసీ ప్రకారం ఆర్థిక రంగంలో ప్రభుత్వ పాత్ర ఉంటుందన్నారు. ప్రైవేటీకరించబడే సంస్థలు... ప్రైవేటీకరణ తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగిస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లోకి మరింత ఈక్విటీ రావాలని కోరుకుంటున్నామన్నారు. ప్రైవేటీకరణ తర్వాత కూడా ఉద్యోగ ప్రయోజనాలకు భద్రత కల్పిస్తామన్నారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లపై తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
రాహుల్కు కౌంటర్...
సుదీర్ఘ మేదోమధనం తర్వాతే కొన్ని ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలని నిర్ణయించామన్నారు. కేంద్ర ప్రభుత్వం లాభాలను ప్రైవేటుకు అప్పగించి నష్టాలను జాతీయం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆమె కొట్టిపారేశారు. ప్రతీసారి ఏదో రెండు వాక్యాలతో కామెంట్లు చేయడం కాకుండా... కాస్త సీరియస్గా చర్చ చేయాలని రాహుల్కు ఆమె సూచించారు. ట్యాక్స్ పేయర్స్ చెల్లించిన డబ్బును యూపీఏ ప్రభుత్వమే ప్రైవేటుకు ధారదత్తం చేసిందన్నారు. 'అతని నానమ్మ ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేసి ఉండవచ్చు. కానీ నష్టాలను జాతీయం చేసింది యూపీఏ హయాంలోనే...' అని పేర్కొన్నారు.