నా వ్యాఖ్యలు రాహుల్ గాంధీపై వ్యక్తిగతం కాదు, కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలి: అమిత్ షా
న్యూఢిల్లీ: తాను చేసే మాటలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీపై వ్యక్తిగత విమర్శలుగా మీడియా చూడవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సోమవారం అన్నారు. ప్రజాస్వామ్య వ్వవస్థలో ప్రతిపక్ష పార్టీ కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. కాంగ్రెస్ ముఖ్త్ భారత్ అనేది బీజేపీ నినాదమని, దీని అర్థం దేశం నుంచి కాంగ్రెస్ను వెళ్లగొట్టాలని కాదని, ఆ పార్టీ సంస్కృతిని పోగొట్టాలనేది అర్థమన్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. కాంగ్రెస్ను ఆ పార్టీ రాహుల్ గాంధీ బతికించుకోవాలన్నారు. ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం ఉండదన్నారు. తన ప్రసంగాల్లో రాహుల్ను టార్గెట్ చేయడం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... తన వ్యాఖ్యలను రాహుల్ వ్యక్తిగతంగా తీసుకోరాదన్నారు.

రాహుల్ తనకు సంధించిన కొన్ని ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పానన్నారు. తాము ఎన్నో మంచి పనులు చేస్తున్నామని, అందుకే బీజేపీకి ప్రజలు మద్దతు పలుకుతున్నారన్నారు. తమ కుటుంబంలోని నాలుగో తరానికి అధికారాన్ని కట్టబెట్టాలని రాహుల్ అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్లో వారసత్వం గురించి రాహుల్ చెప్పాలని, బీజేపీలో వారసత్వం గురించి తాను చెబుతానని వ్యాఖ్యానించారు. మధ్యతరగతి ప్రజలు బీజేపీ వెంటే ఉన్నారన్నారు. 14 రాష్ట్రాల్లో బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టింది వారే అన్నారు.
దేశ సరిహద్దులను సురక్షితంగా ఉంచామని, గత నాలుగేళ్లలో భారీ సంఖ్యలో తీవ్రవాదులను హతమార్చామన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనలకు వెళ్తే ఎవరికీ తెలిసేది కాదనన్నారు. ఇప్పుడు ప్రధాని మోడీ విదేశాలకు వెళ్తే ఎన్నారైలతో పాటు ఆయా దేశ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications