ఇక ‘ఆధార్’ ఉంటేనే.. విమాన టికెట్ బుకింగ్, ప్రయాణం
ఇక మీదట విమానాశ్రయంలోకి ప్రవేశించాలన్నా.. విమానం ఎక్కాలన్నా ‘ఆధార్’.. కీలకం కానుంది.
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు విమానాశ్రయంలో ప్రవేశించడానికి ఏదైనా ఐడీ కార్డు ఉంటే సరిపోతుంది. కానీ ఇక మీదట ఇలా కాదు, మీరు విమానాశ్రయంలోకి ప్రవేశించాలన్నా.. విమానం ఎక్కాలన్నా 'ఆధార్' కీలకం కానుంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా దేశీయ విమాన ప్రయాణాలకు 'ఆధార్'ను తప్పనిసరి చేసేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధం చేస్తోంది. ఈ బాధ్యతను ఐటీ దిగ్గజం 'విప్రో'కు అప్పగించింది.
టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలో తప్పనిసరిగా ఆధార్ నంబర్ ను నమోదు చేసేలా నిబంధనలు తీసుకురానున్నారు. దీనికోసం ఆయా విమానాశ్రయాల్లో బయోమెట్రిక్ యాక్సెస్ ను కూడా అందుబాటులోనికి తీసుకురానున్నారు.
విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్ద ఉండే టచ్ ప్యాడ్ పై ప్రయాణికుడు తన బొటనవేలిని ఉంచితే చాలు.. ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం మొత్తం సెక్యూరిటీకి చేరిపోతుంది. ఇటీవల విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా, కార్యదర్శి ఆర్.ఎన్.చౌబేలు ఎయిర్ పోర్టు ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
విదేశీ ప్రయాణాలకు మాత్రం పోస్ పోర్టు తప్పనిసరి. ఒక్క దేశీయ ప్రయాణాలకు మాత్రమే ఆధార్ ను అనుసంధానం చేయనున్నారు. ఈ కొత్త విధానం ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గురు ప్రసాద్ మహాపాత్ర తెలిపారు.