Omicron Virus: రాష్ట్రాలు అప్రమత్తం : సరిహద్దుల్లో ఆంక్షలు - ప్రయాణీకులకు పరీక్షలు..!!
ఓమ్రికాన్ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన.. బీ 1.1.529 ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ.. కునుకు లేకుండా చేస్తోంది.. బీ.1.1.529ను ఆందోళనర వేరియెంట్గా గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఈ కొత్త వేరియెంట్కు 'ఒమిక్రాన్' అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే కాగా.. ఈ మహమ్మారితో చాలా దేశాలు అప్రమత్తమై.. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి.. భారత్ కూడా అప్రమత్తం అయ్యింది.. మరోవైపు.. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్.. ఇలా ప్రతీ సారి అత్యధిక కేసులు వెలుగు చూసిన మహారాష్ట్ర ముందస్తు చర్యలకు పూనుకుంది.

రాష్ట్రాలు అప్రమత్తం
మహారాష్ట్రతో పాటుగా భారత్ లోని పలు రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఆంక్షలు అమలు చేస్తున్నాయి. నిబంధనుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచామని, వారి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపినట్లు ముంబై మేయర్ కిషోరి పద్నేకర్ తెలిపారు.

ఆంక్షలు..నిబంధనలు
వ్యాక్సినేషన్ పూర్తి కాని, కరోనా ముప్పు అధికంగా ఉండే దేశాల నుంచి వచ్చే వారు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని గుజరాత్ సర్కార్ పేర్కొన్నది. అన్ని విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని కేరళ మంత్రి వీణాజార్జి తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరికి కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరిని క్వారంటైన్కు పంపారు. ఇది కొత్త వేరియంటేమోనని వైద్యాధికారులు మొదట ఆందోళనకు గురయ్యారు. రెండు డోసులు వేసుకున్నవారికే మహారాష్ట్రలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేసింది.

కర్ణాటకలో సరిహద్దుల మూసివేత
ఇక, 72 గంటల ముందు చేయించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టుతోనే రావాలని నిబంధన పెట్టింది. సౌతాఫ్రికా నుంచి వచ్చినవారికి క్వారంటైన్ తప్పనిసరి అని ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. బెంగుళూరులో ఇద్దరు ప్రయాణీకులకు కరోనా పాజిటివ్ గా గుర్తించారు. అధికారులు వీరిని వెంటనే బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో క్వారంటైన్లో ఉంచారు. ఒమిక్రాన్ వేరియంటేనా అన్న నేపథ్యంలో నిర్థారణకోసం శాంపిల్స్ను ముంబయి ల్యాక్కు పంపించారు. బెంగళూరులో కరోనా కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

మహారాష్ట్రలోనూ కొత్త నిబంధనలు
ఈ కొత్త వేరియంట్ మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్, డెల్టా కంటే ప్రమాదకరమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరికలు సైతం జారీ చేసింది. ఇక కొత్త వేరియంట్పై కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన ప్రధాని మోదీ.. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించారు. కర్నాటక రాష్ట్రంలో సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించారు.

డెల్టా కంటే ప్రమాదకరమంటూ
కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారికీ ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకుతోంది. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది అత్యంత ప్రమాదకారి కావచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు వెలుగుచూసిన కోవిడ్ వేరియెంట్ల కంటే ఇది వేగంగా వ్యాపించి, తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య నిపుణుల హెచ్చరికలతో అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications