గోడ దూకెయ్, బయటే కారుంది: కాంగ్రెస్ ఎమ్మెల్యేకి బీజేపీ ఫోన్, అందుకే హైదరాబాద్కు మకాం
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప గురువారం ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అయితే, యడ్యూరప్ప తన అధికారాన్ని నిలుపుకోవాలంటే బీజేపీకి 105 ఎమ్మెల్యేలకు తోడు మరో ఏడుగురు ఎమ్మెల్యేలు అవసరం ఉంది. దీంతో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు విశ్వప్రయత్నాలే చేస్తోంది.
Recommended Video
మరో ఏడుగురు అవసరం
ఎన్నికల్లో 104సీట్లే బీజేపీ గెలిచినప్పటికీ.. తాజాగా ఓ స్వతంత్ర అభ్యర్థి బీజేపీకి మద్దతు ప్రకటించడంతో ఈ సంఖ్య 105కు పెరిగింది. అసెంబ్లీ బలనిరూపణ చేసుకోవాలంటే మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరిగా బీజేపీకి అవసరం. ఈ నేపథ్యంలో బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమ వైపు తిప్పుకుంటోందని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
హైదరాబాద్కు మారిన కర్ణాటక రాజకీయం: ప్రముఖ హోటళ్లకు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు
12ఎమ్మెల్యేల మద్దతంటూ..
జేడీఎస్ పార్టీకి చెందిన సుమారు 12మంది ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని ఇప్పటికే సీఎం యడ్యూరప్ప ప్రకటించారు. ఈ క్రమంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు రహస్య ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాయి.
బెంగళూరు సేఫ్ కాదని..
నిన్నటి వరకు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరులోని ప్రముఖ హోటళ్లు, రిసార్టుల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇక్కడే ఉంటే తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టి తమవైపునకు తిప్పుకుంటుందని రెండు పార్టీలు ఆందోళన చెందాయి. తాజాగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
గోడదూకెయ్.. కారుంది..
‘నేను రిసార్టులో ఉండగా.. నన్ను గోడ దూకి ఎలాగైనా బయటికి రావాలని ఓ ఫోన్ వచ్చింది. అంతేగాక. రిసార్టు బయటే ఓ కారు మీ కోసం వేచి ఉందని చెప్పారు' అని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తనకు వచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్పారు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఉంటే తమ ఎమ్మెల్యేల్లో కొందరు బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్, జేడీఎస్.. హైదరాబాద్కు తరలించినట్లు తెలుస్తోంది. అంతేగాక, తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే జేడీఎస్కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.