9 తప్పులు చేసిన పాకిస్తాన్: భారత్ కౌంట్డౌన్?
India Pakistan War: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం.. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు దేశాలు కూడా కాలు దువ్వుకుంటోన్నాయి. యుద్ధ సన్నాహాలు సైతం చేపట్టాయి.
ఈ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ బరితెగిస్తోంది. తన తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. నిన్నటి వరకూ జమ్మూ కాశ్మీర్ సమీపంలో నియంత్రణ రేఖ (LoC) పొడవునా కాల్పులకు తెగబడుతూ వస్తోంది పాకిస్తాన్ సైన్యం. భారత ఆర్మీ పోస్టులపై తేలికపాటి ఆయుధాలతో పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరిపారు.

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. కుప్వారా, యూరీ, అఖ్నూర్ సెక్టార్ పరిధిలో నియంత్రణ రేఖ పొడవునా ఈ కాల్పలు జరిగినట్లు భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. దీన్ని సరిహద్దు భద్రత జవాన్లు సమర్థవంతంగా తిప్పి కొట్టినట్లు వివరించారు.
కిందటి నెల 22వ తేదీన పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి సంభవించిన మరుసటి రోజు నుంచే నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొంటూ వచ్చింది. ఈ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్కు ప్రత్యక్ష ప్రమేయం ఉందంటూ భారత్ ఆరోఫించిన నేపథ్యంలో ఈ కాల్పులు మొదలయ్యాయి.
భారత్తో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తోంది పాకిస్తాన్. భారత సైన్యం సహనానికీ పరీక్షలు పెడుతోంది. ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా హఠాత్తుగా కాల్పులకు దిగుతోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత ఎల్ఓసీ వద్ద పాకిస్తాన్ కాల్పులు జరపడం ఇది తొమ్మిదోసారి.
అంతముందు- జమ్మూ జిల్లా పర్గ్వాల్ సెక్టార్, రాజౌరి జిల్లాలోని సుందర్బనీ, నౌషేరా, అఖ్నూర్ సెక్టార్ల పరిధిలో అంతర్జాతీయ సరిహద్దు పొడవునా గల భారత ఆర్మీ పోస్టులపై పాకిస్తాన్ ఈ కాల్పులు జరిపింది. దీన్ని భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పి కొట్టారు. పాకిస్తాన్కు తగిన విధంగా బుద్ధి చెప్పారు.
మొదట్లో కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో కాల్పులు ప్రారంభం అయ్యాయి. అనంతరం పూంచ్, అఖ్నూర్ సెక్టార్లకు వ్యాపించాయి. క్రమంగా రాజౌరి జిల్లాలోని సుందర్బని, నౌషేరా సెక్టార్లల్లో దీని ఉధృతి కనిపించింది. దీని తరువాత జమ్మూలోని పర్గ్వాల్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.
భారత- పాకిస్తాన్ 3,323 కిలో మీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోన్నాయి. ఇందులో అంతర్జాతీయ సరిహద్దు గుజరాత్ నుండి జమ్మూలోని అఖ్నూర్ వరకు దాదాపు 2,400 కిలో మీటర్లు. జమ్మూ నుండి లఢక్ రాజధాని లేహ్ వరకు 740 కిలో మీటర్ల మేర నియంత్రణ రేఖ పంచుకుంటోంది. సియాచిన్ ప్రాంతంలో 110 కిలోమీటర్ల యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ ఉన్నాయి.












Click it and Unblock the Notifications