దేశంలోకి "మేడ్ ఇన్ పాకిస్థాన్" ఫ్యాన్.. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత
భారత్ కు సరిహద్దు దేశమైన పాకిస్థాన్ తో ఎప్పుడూ ప్రమాదమే. పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రమూకలు ఇప్పటికే భారత్ పై అనేక సార్లు దాడులకు పాల్పడ్డాయి. గతేడాది ఏప్రిల్ 22 న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ దాడుల వెనుక ఉన్నట్లు తేలిన నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. మే 7 నుంచి 10 మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద సంస్థలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. అలాగే వందలాది మంది ఉగ్రమూకలను హతమార్చింది.
ఇక పాకిస్థాన్ పై భారత్ కఠిన ఆంక్షలు అమలు చేసింది. సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత, ఇరు దేశాల మధ్య గగనతలం నిలిపివేత అలాగే ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు నిలిపివేసింది. దాంతో భారత్- పాకిస్థాన్ మధ్య వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. అయితే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని కుశీనగర్ జిల్లాలో ఒక మదర్సాలో మేడ్ ఇన్ పాకిస్థాన్ అని ఉన్న సీలింగ్ ఫ్యాన్ కనిపించడం తీవ్ర దుమారం రేపింది. కుశీనగర్ లో ఉన్న మదర్సాకు చెందిన ఓ మౌల్వీ.. రెండు పాత ఫ్యాన్లు, ఒక మోటార్ ను రిపేర్ కోసం మెకానిక్ వద్దకు పంపారు.
అయితే ఆ ఫ్యాన్ ను రిపేర్ చేస్తున్న క్రమంలో దానిపై మేడ్ ఇన్ పాకిస్థాన్ అని లేబుల్ ఉండటాన్ని మెకానిక్ గమనించాడు. ఆ ఫ్యాన్ కు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు మదర్సా నిర్వాహకులతోపాటుగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ప్రాధమిక విచారణలో ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగినట్లు ఆధారాలు లభించలేదని తేలింది.

ఇక ఆ ఫ్యాన్ అక్కడికి ఎలా వచ్చిందని పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఆ ఫ్యాన్ కొత్తగా కొన్నది కాదు. స్థానికంగా ఉండే షంషూద్దీన్ అనే ఓ వ్యక్తి 2023 లో ఈ ఫ్యాన్ ను మదర్సాకు దానం చేశాడు. షంషూద్దీన్ కుమారుడు గతంలో సౌదీ అరేబియాలో పనిచేసేవారు. కొన్నేళ్ల క్రితం సౌదీ నుంచి ఈ ఫ్యాన్ ను తన ఇంటికి పంపారు. ఇంట్లో చాలాకాలం వాడకుండా ఉంచారు. ఆ తర్వాత షంషూద్దీన్ ఆ ఫ్యాన్ ను మదర్సాకు ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ ఫ్యాన్ కనిపించడం స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది.












Click it and Unblock the Notifications