పాకిస్థాన్ డర్టీ గేమ్.. ఇండియా యుద్దం చేయొచ్చంటూ కొత్త ఎత్తుగడ..!
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మరో డర్టీ గేమ్కు తెరలేపింది. ఇండియా తమ దేశంపై దాడి చేయొచ్చంటూ కొత్త ఎత్తుగడకు తెర తీసింది. కశ్మీర్ ఇష్యూపై అంతర్జాతీయ సమాజంలో భారత్కు వస్తున్న స్పందన చూసి పాకిస్థాన్ వెర్రి కుట్రలకు ప్లాన్ చేస్తోంది. ఆ క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ భారత్ ప్రతిష్టను దిగజార్చేలా ప్రయత్నిస్తోంది.
భారత్ తమపై దాడిచేసే ఛాన్సుందని వ్యాఖ్యానించారు పాకిస్థాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్. కశ్మీర్ ఇష్యూలో అంతర్జాతీయ సమాజం దృష్టి మరల్చేందుకే ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడబోతుందని పేర్కొన్నారు. శనివారం నాడు పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ, పాకిస్థాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ మేరకు కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
అణ్వాయుధాలు ప్రయోగించరాదన్న విధానానికి కట్టుబడి ఉన్నామని తొలుత ప్రకటించి.. ఇప్పుడేమో ఫ్యూచర్ అవసరాల మేరకు ఆ నిర్ణయం మారవచ్చని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై గఫూర్ మండిపడ్డారు. అయితే ఇండియా ఎలాంటి చర్యలు తీసుకున్నా సరే.. తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆ మేరకు ఎల్వోసీ వెంట పాక్ బలగాలను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ మాట్లాడుతూ.. అణ్వాయుధాల ప్రయోగంపై రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ అలా మాట్లాడటం దురదృష్టకరంగా అభివర్ణించారు.
అయితే ఖురేషీ మరో అడుగు ముందుకేసి భారత్పై తీవ్ర ఆరోపణాస్త్రాలు గుప్పించారు. ఇండియా యుద్దోన్మాదంతో రగిలిపోతుందనడానికి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో పాకిస్థాన్ విదేశాంగ శాఖలో కశ్మీర్ ఇష్యూకు సంబంధించి ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో దానిపై చర్చ జరిగేలా ఆ విభాగం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా రాయబారుల్ని సైతం నియమిస్తామని ఖురేషీ వ్యాఖ్యానించారు.