ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత.. కాల్పులకు ముందు ఫేస్బుక్ లైవ్లో నిందితుడు
న్యూఢిల్లీ: ఢిల్లీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జామియా ప్రాంతంలో రాంభగత్ గోపాల్ అనే వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపగా ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. పౌరసత్వ సవరణకు వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు నిరసనలు తెలుపుతున్న క్రమంలో గోపాల్ కాల్పులకు తెగబడ్డాడు. ఈ క్రమంలోనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జామా మసీదు ఎంట్రీ మరియు ఎగ్జిట్ గేట్లను మూసివేయడం జరిగింది. ఇక ఢిల్లీ నగరంలో మూడు మెట్రో స్టేషన్లను సైతం మూసివేయడం జరిగింది.
నిరసనలు తెలుపుతున్న జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులపై గోపాల్ కాల్పులకు తెగబడటంతో ఒక్కసారిగా ఆప్రాంతం ఉలిక్కి పడింది. ఓ విద్యార్థికి గాయాలు కావడంతో ఆ ప్రాంతంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ప్రస్తుతం గోపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. జామియా మిలియా యూనివర్శిటీ దగ్గర భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులు జామియా యూనివర్శిటీ నుంచి ర్యాలీగా రాజ్ఘాట్కు వెళుతున్న క్రమంలో కాల్పులు జరిగాయి. కాల్పులకు ముందు నిందితుడు కేకలు వేశాడు. ఎవరికి కావాలి స్వాతంత్ర్యం, నేను స్వాతంత్ర్యం ఇస్తాను అంటూ నిందితుడు కేకలు వేస్తూ కాల్పులు జరిపాడు.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అసలే ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ఊపుమీద ఉండగా ఈ ఘటనతో ఒక్కసారిగా రాజకీయరంగు పులుముకుంది. ఈ దాడి వెనక బీజేపీ ఉందని ఆమ్ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఘటన చోటుచేసుకోక ముందు నిందితుడు గోపాల్ ఫేస్బుక్లో లైవ్లో మాట్లాడాడు. ఒకవేళ తను మరణిస్తే తన మృతదేహంపై కాషాయ వస్త్రం ఉంచాలని జైశ్రీరామ్ అనే నినాదాలు చేయాలని గోపాల్ ఫేస్బుక్ లైవ్ ద్వారా చెప్పుకొచ్చాడు.