శశికళ సై, అంతకంతకూ పెరుగుతున్న పన్నీరు: పాండ్యరాజన్ గందరగోళం
చెన్నై: తమిళనాడులో రాజకీయ సస్పెన్స్ కొనసాగుతోంది. అన్నాడీఎంకే పార్టీలో అధినేత్రి శశికళ వర్గం నుంచి వరుసగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వైపు నేతలు వస్తున్నారు. పన్నీరు బలం పుంజుకుంటున్నప్పటికీ శశికళ నిబ్బరం కోల్పోవడం లేదు.
ఈ నేపథ్యంలో ఆమె వర్గంలోని ఎంపీ వైద్యలింగం ఆదివారం మాట్లాడారు. శశికళను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు త్వరలోనే ఆహ్వానిస్తారని, ఆమెకు పూర్తి మెజార్టీ ఉందని, తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు.
అనంతరం శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యే తంగ తమిళ్సెల్వన్ మాట్లాడారు. శశికళకు 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమ శిబిరం బలనిరూపణకు సిద్ధమన్నారు. అలాగే, గవర్నర్, రాష్ట్రపతి, ఇంకెవరి ముందైనా శశికళ వర్గం ఎమ్మెల్యేలు పరేడ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
పెరుగుతున్న పన్నీరు బలం
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. శశికళపై ఆరోపణలు చేసిన రోజున ఒక్కరుగానే ఉన్న ఆయన క్రమంగా బలం పుంజుకుంటున్నారు. శశికళతో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా ఆయన వర్గంలో చేరుతున్నారు.
పన్నీరుసెల్వం ఊహించని ట్విస్ట్, అప్రమత్తమైన శశికళ.. రిసార్ట్కు
ఇప్పటివరకు ఆయనకు 10 మంది ఎంపీలు మద్దతు తెలిపారు. రాజ్యసభ ఎంపీ మైత్రేయన్ తొలుత మద్దతు ప్రకటించగా, శనివారం పీఆర్ సుందరం, కె అశోక్ కుమార్, సత్యభామ, ఆదివారం బి సెంగుత్తవన్, జె జయసింగ్, మరుతరాజా, త్యాగరాజన్, రాజేంద్రన్, లక్ష్మణన్ పన్నీరుకు మద్దతు ప్రకటించారు.
మరోవైపు అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదన్, విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్, మాజీ ఎంపీ రామానుజన్, మాజీ మంత్రి పొన్నయ్యన్ తదితరులు పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యేలు శశికళ శిబిరంలో ఉన్నప్పటికీ పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు ఒక్కొక్కరుగా పన్నీర్ వైపు వెళ్లిపోతుండటంతో ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతోంది. పలువురు నేతల నుంచి అనూహ్య మద్దతు కారణంగా పన్నీర్ సెల్వం వర్గంలో ఉత్సాహం నెలకొంది.
పట్టుబిగుస్తున్న పన్నీరు: శశికళ చేసిన మూడు తప్పులు!
పాండ్యరాజన్ గందరగోళం
శశికళ, పన్నీర్ సెల్వం ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాల్లో ఉన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు జారిపోకుండా శశికళ ప్రయత్నిస్తుండగా, తన బలం పెంచుకునేందుకు పన్నీర్ ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో తమకు మద్దతు ఇచ్చిన నేతలు ఎవరితో భేటీ అయినా రెండు వర్గాల వారు అనుమానించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా ఒక సంఘటన చోటుచేసుకుంది. పన్నీర్ సెల్వం కు మంత్రి పాండ్య రాజన్ శనివారం తన మద్దతు ప్రకటించారు.
అయితే, ఆదివారం ఉదయం నటరాజన్ను ఆయన కలిసినట్లుగా వార్తల వచ్చాయి. దీంతో, పాండ్య రాజన్ ప్లేట్ ఫిరాయించారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో పాండ్య రాజన్ స్పందిస్తూ.. తాను కలిసింది శశికళ భర్త నటరాజన్ను కాదని, మైలాపూర్ ఎమ్మెల్యే ఆర్ నటరాజన్ ని అని చెప్పారు. దీంతో గందరగోళానికి తెరపడింది.