వైసీపీకి అగ్నిపరీక్ష పెట్టనున్న ఆ కీలక బిల్లు..!!
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు వెలువడ్డాయి. ఇప్పటికే ఈ షెడ్యూల్ వెలువడింది. దీన్ని అధికారికంగా ప్రకటించింది కేంద్రం. తాజాగా పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ శీతాకాల సమావేశాల్లో పలు కీలక అంశాలు, బిల్లులు ఈ సమావేశాల్లో ప్రస్తావనకు రానున్నాయి. వ్యక్తిగత డేటా భద్రత, విద్యుత్ బిల్లును అధికార ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రవేశపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

డిసెంబర్ 7 నుంచి..
డిసెంబర్ 7వ తేదీన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఆరంభం కానున్నాయి. 29వ తేదీ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా 17 రోజుల పాటు లోక్సభ, రాజ్యసభ సమావేశం కానుంది. ఈ తేదీల్లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకోవచ్చని మొదట భావించారు గానీ వాటినే ఖాయం చేశారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి. ఉభయ సభలను సమావేశపర్చడానికి అవసరమైన చర్యలను తీసుకుంటోన్నామని అన్నారు.

బిల్లులు ఇవే..
వ్యక్తిగత డేటా భద్రత, విద్యుత్ సవరణ బిల్లు, కాంపిటీషన్ సవరణ బిల్లు, న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ సవరణ బిల్లు, వన్యప్రాణుల సంరక్షణ సవరణ బిల్లు వంటివి సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటితోపాటు 30కి పైగా బిల్లులు సభామోదం పొందే వీలు ఉంది. వీటన్నింటిపై ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతను కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దగా ఎలాంటి ప్రతిఘటించకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి.

ఆ బిల్లుపై వైఖరేంటీ?
అన్ని బిల్లులు ఒక ఎత్తయితే- విద్యుత్ సవరణ బిల్లు మరో ఎత్తుగా మారబోతోంది. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులను తీసుకురావడానికి ఉద్దేశించిన బిల్లు ఇది. వ్యవసాయ మోటార్లకు మీటర్లను అమర్చాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పొందుపరిచింది ఇందులో. ఈ బిల్లుపై ఇప్పటికే బీజేపీయేతర పార్టీలన్నీ వ్యతిరేకిస్తోన్నాయి. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, మమత బెనర్జీ, ఎంకే స్టాలిన్.. తమ వైఖరిని స్పష్టం చేశారు.

మోటార్లకు మీటర్లు..
వ్యవసాయ మోటార్లకు మీటర్లను అమర్చడం జరిగితే- క్రమంగా ఉచిత విద్యుత్ను ఎత్తేస్తారంటూ ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఇది పూర్తిగా విద్యుత్ సవరణ చట్టం మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉన్నప్పటికీ- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంగా ప్రొజెక్ట్ చేస్తోంది టీడీపీ. ఈ బిల్లుపై గనక ఉభయ సభలో వైఎస్ఆర్సీపీ సభ్యులు అనుకూలంగా వ్యవహరిస్తే మాత్రం ఆ ఆరోపణలను నిజం చేసినట్టవుతుందనే వాదనలూ లేకపోలేదు.

ఉచిత విద్యుత్ మరింత భారం..
ఏపీ, తెలంగాణల్లో వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోన్నాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు. ఇంకొన్ని రాష్ట్రాల్లో గృహావసర వినియోగదారులకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ఉచితంగా సరఫరా చేస్తోన్నారు. విద్యుత్ సవరణ బిల్లుతో అది సాధ్యపడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దాన్ని కొనసాగించాల్సి వస్తే- ఆర్థికంగా పెను భారంగా మారుతుందనీ అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications