సీఎం పేరును ఖరారు చేశాం!: బీజేపీ నేత, బలం నిరూపించుకుంటాం.. గవర్నర్తో కాంగ్రెస్
పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. పారికర్ మృతి అనంతరం కాంగ్రెస్ బలం 14, బీజేపీకి 12 ఉన్నాయి. బీజేపీకి స్వతంత్రులు, ఎంజీపీ మద్దతిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు.
గవర్నర్ వద్దకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
బీజేపీకి మెజార్టీ లేదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించాలని కాంగ్రెస్ గవర్నర్ను కోరింది. ఈ మేరకు 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ చేరుకున్నారు. గవర్నర్ మృదుల సిన్హాతో భేటీ అయ్యారు. గవర్నర్తో భేటీ అనంతరం ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కావ్లేకర్ మాట్లాడారు. గోవాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ తమదేనని, 14 మంది ఎమ్మెల్యేలం గవర్నర్ను కలిశామని, తాము బలం నిరూపించుకుంటామని చెప్పామన్నారు. కాగా అంతకుముందు, కాంగ్రెస్ పార్టీ నేతలు పనాజీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ కావ్లేకర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ఎమ్మెల్యేలం అందరం రాజ్ భవన్ వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్ను కోరుతామన్నారు.
ఎంజీపీ మద్దతు ఎవరికి?
మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) ఇప్పటి వరకు బీజేపీకి మద్దతిస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బీజేపీకి మద్దతు కొనసాగించాలా, కాంగ్రెస్కు మద్దతివ్వాలా అనే అంశంపై ఆ పార్టీ చర్చిస్తోంది. ఎంజీపీ లీడర్ సుదిన్ దివాకర్ ఆదివారం మాట్లాడుతూ.. తదుపరి ముఖ్యమంత్రిగా తనకు అవకాశమివ్వాలన్నారు. అయితే, సోమవారం యూటర్న్ తీసుకున్నారు. తాను రేసులో లేనని చెప్పారు. ఈ రోజు ఎంజీపీ నేతలు భేటీ అయి, ఎవరికి మద్దతివ్వాలో నిర్ణయిస్తారు.
సీఎం అభ్యర్థిపై బీజేపీ మౌనం కానీ
తదుపరి ముఖ్యమంత్రి అంశంపై బీజేపీ ప్రస్తుతానికి మౌనంగా ఉంది. ఈ రోజు సాయంత్రం మనోహర్ పారికర్ అంత్యక్రియలు ఉన్నాయి. దీంతో తదుపరి సీఎం అభ్యర్థిపై బీజేపీ అధిష్టానం మౌనంగా ఉంది. కానీ గోవా బీజేపీ చీఫ్ వినయ్ టెండుల్కర్ మాత్రం ఈ రోజు మూడు గంటల తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పడం గమనార్హం. ఈ రోజు రెండు గంటల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారని తెలిపారు. నితిన్ గడ్కరీ సీఎం అభ్యర్థి అంశంపై కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. గోవా డిప్యూటీ స్పీకర్ మైఖేల్ లోబో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారయ్యారన్నారు. త్వరలో వివరాలు వెల్లడిస్తామన్నారు.