తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. కేంద్రం బిగ్ హింట్..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. 100 రోజులకు పైగా ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాంతో అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ఎదుర్కొంటున్న నష్టాలను తగ్గించేందుకు మే 15 నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్రం పెంచుతూ వచ్చింది. 10 రోజుల వ్యవధిలో వరుసగా 4 సార్లు రేట్లను సవరించింది. మే 15 న తొలిసారి లీటర్ కు రూ. 3 చొప్పున పెంచింది. చివరగా మే 25 న లీటర్ పెట్రోల్ పై రూ. 2.80 పెంచారు. అయితే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక హింట్ ఇచ్చింది.
ఈ మేరకు త్వరలోనే ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ ఘర్షణల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు బ్యారెల్ కు దాదాపు 100 డాలర్ల సమీపానికి చేరుకున్నాయి. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు రూ. 7 వరకు పెరిగాయి. అయితే ఈ ధరలు ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదని.. రాబోయే రోజుల్లో చమురు ధరలు తగ్గుముఖం పడతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
అంతర్జాతీయంగా సరఫరాకు ఏమైనా అడ్డంకులు ఏర్పడితే వాటిని అధిగమించేందుకు వీలుగా భారత్ వద్ద 70 నుంచి 80 రోజులకు సరిపడా చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నట్లు ఇటీవల కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా ఆగిపోకుండా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించి శాంతిని నెలకొల్పాలని భారత్ మొదటి నుంచి విజ్ఞప్తి చేస్తోంది. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో దాదాపు 20 శాతం హార్మూజ్ జలసంధి నుంచే సరఫరా అవుతోంది. హార్మూజ్ జలసంధిపై ఉద్రిక్తతలు తగ్గితే ధరలు మరింత వేగంగా అదుపులోకి వస్తాయని భారత్ భావిస్తోంది.

ఇక ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ. 95 గా ఉంది. అలాగే ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111 గా ఉంది. డీజిల్ ధర రూ.97 గా ఉంది. అలాగే కోల్ కతా లో లీటర్ పెట్రోల్ ధర రూ. 113, చెన్నైలో రూ. 107 గా ఉంది. ఇక హైదరాబాద్ లో లీటర్ డీజిల్ ధర రూ. 103 కాగా, బెంగళూరులో రూ. 98 గా ఉంది.












Click it and Unblock the Notifications