ఒకే జాతి పక్షులు- ఆర్ఎస్ఎస్పై నిషేధం వేేటు..!!
తిరువనంతపురం: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై నిషేధం వేటు పడింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థ కార్యకలాపాలన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పీఎఫ్ఐ- దాని అనుబంధ సంఘాలన్నింటినీ నిషేధం జాబితాలో చేర్చింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. అయిదు సంవత్సరాల పాటు ఈ నిషేధం అమలులో ఉంటుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కింద వాటిపై నిషేధాన్ని విధించినట్లు తెలిపింది.
పీఎఫ్ఐకి అనుబంధంగా కొనసాగుతున్న రిహాబ్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ అండ్ రిహాబ్ ఫౌండేషన్, దాని అనుబంధ సంఘాలపై కేంద్రం నిషేధం విధించింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో పీఎఫ్ఐకి సంబంధాలు ఉన్నాయని, ఈ సంస్థకు చెందిన కొందరు కార్యకర్తలు ఐసిస్లో కూడా చేరారంటూ హోం మంత్రిత్వ శాఖ నిర్ధారించింది.
దీనిపై కేరళకు చెందిన కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు, పార్టీ విప్ కోడికున్నిల్ సురేష్ స్పందించారు. చాలాకాలంగా ఈ డిమాండ్ ఉందని, వామపక్ష పార్టీల నాయకులు కూడా నిషేధాన్ని కోరుకుంటోన్నారని వివరించారు. కొద్దిసేపటి కిందటే ఆయన మళప్పురంలో ఆయన మాట్లాడారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించకూడదనేది తమ పార్టీ సిద్ధాంతమని పేర్కొన్నారు. నిషేధం విధించడం వల్ల సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేశారు.
పీఎఫ్ఐ- దాని అనుబంధ సంస్థలను మాత్రమే కాకుండా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను కూడా నిషేధించాలని కోడికున్నిల్ సురేష్ డిమాండ్ చేశారు. పీఎఫ్ఐ-ఆర్ఎస్ఎస్ రెండూ ఒకే జాతి పక్షులని వ్యాఖ్యానించారు. పీఎఫ్ఐ తరహాలోనే ఆర్ఎస్ఎస్ కూడా హిందూ మతతత్వాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింపజేస్తోందని చెప్పారు. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐని మాత్రమే ఎందుకు నిషేధించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ను కూడా నిషేధిత జాబితాలో చేర్చాలని అన్నారు.
పీఎఫ్ఐని నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే పలు రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తర ప్రదేశ్లల్లో దీని తీవ్రత అధికంగా కనిపిస్తోంది. కర్ణాటకలో బెంగళూరు, హుబ్బళ్లి, కలబురగి, బెళగావి, బీదర్, చిక్బళ్లాపుర, రాయచూర్, రామనగర, మంగళూరు, తమిళనాడులో కోయంబత్తూరు, సేలం, ఈరోడ్ వంటి చోట్ల పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. చెన్నైలో గల పీఎఫ్ఐ ప్రధాన కార్యాలయం ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు.