భారత్- ఫిలిప్పీన్స్ మధ్య రూ. 2800 కోట్ల డీల్: చైనాకు చెక్ పెట్టేందుకే, డ్రాగన్ కన్ను
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత్ ఎవరూ ఊహించని పురోగతిని సాధిస్తోంది. ఆయుధాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆనవాయితీకి స్వస్తి పలికి.. ఇప్పుడు అత్యంత నాణ్యతతో స్వదేశంలోనే ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది. తయారు చేసుకోవడమే కాదు.. ఇతర దేశాలకూ ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది.
ఇందులో భాగంగా భారత్-ఫిలిప్పీన్స్ మధ్య భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఆ దేశ నౌకాదళానికి భారత్ తాము రూపొందించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణులను విక్రయించనుంది. ఈ ఒప్పందం విలువ 375 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 2,800 కోట్లకుపైనే.
ఫిలిప్పీన్స్ కు యాంటీ షిప్ మిస్సైల్ సిస్టమ్ను సరఫరా చేసేందుకు బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్(బీఏపీఎల్) జనవరి 28న రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్ జాతీయ రక్షణ విభాగంతో ఒప్పందం కుదుర్చుకున్నామని రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
బ్రహ్మోస్ ఏరోస్పేస్ సీఈఓ అతుల్ డి రాణె, డిప్యూటీ సీఈఓ సంజీవ్ జోషీ, లెఫ్టినెంట్ కల్నల్ ఆర్ నేగి, ప్రవీణ్ పాఠక్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. విమానాలు, నౌకలు, జలాంతర్గములు, నేల మీద నుంచి 400 కిలోమీటర్ల లోపు ఉండే లక్ష్యాన్నైనా ఛేదించేలా బ్రహ్మోస్ క్షిపణుల రకాలను శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఆయా క్షిపణులను మరింత మెరుగుపెట్టేలా సన్నద్ధతను పరీక్షిస్తున్నారు.
ఇది ఇలావుండగా, భారత్-ఫిలిప్పీన్స్ రక్షణ ఒప్పందంపై చైనా ఓ కన్నేసినట్లు తెలుస్తోంది. భారత్ తోపాటు ఫిలిప్పీన్స్ దేశాన్ని కూడా చైనా ఇబ్బంది పెడుతోంది. ఈ క్రమంలోనే భారత్ నుంచి శక్తివంతమైన క్షిపణులను ఫిలిప్పీన్స్ దిగుమతి చేసుకుంటోంది.
చైనా నుంచి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో బ్రహ్మోస్ తమకు రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని ఫిలిప్పీన్స్ భావిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోకి తరచుగా డ్రాగన్ తన యుద్ధ నౌకలను పంపుతూ చిన్నదేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడు బ్రహ్మోస్ యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైళ్లతో చైనాకు ధీటుగా జవాబిచ్చేందుకు ఫిలిప్పీన్స్ సిద్ధమవుతోంది.