చైనా సైనికుల తెంపరితనం: ఆ రాత్రి ఏం జరిగిందంటే: సరిహద్దుల్లో కాల్పులపై ఆర్మీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన కాల్పుల ఘటనపై ఆర్మీ అధికారులు స్పందించారు. కాల్పులకు దారి తీయడానికి గల కారణాలను వెల్లడించారు. దీనిపై ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. మొన్నటిదాకా భారత జవాన్లపై ఘర్షణలకు పాల్పడుతూ వచ్చిన చైనా ఈ సారి మరింత బరితెగించి, ఏకంగా కాల్పులకు దిగడాన్ని తప్పుపట్టారు. భారత జవాన్లు తమ దేశ భూభాగంపైకి అక్రమంగా ప్రవేశించడాన్ని అడ్డుకోవడంలో భాగంగా వారిపై కాల్పులు జరపాల్సి వచ్చిందంటూ చైనా చేసిన ప్రకటనను తోసిపుచ్చారు.
Recommended Video

వాస్తవానికి భిన్నంగా..
వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పాంగ్యాంగ్ త్సొ సరస్సు దక్షిణ ప్రాంతంలోని షెన్పాయ్ పర్వతంపై సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత.. ఈ కాల్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత జవాన్లు.. తమదేశ భూభాగంపైకి అక్రమంగా ప్రవేశించడానికి చేసిన ప్రయత్నాలను తిప్పి కొట్టామని, దీనికోసం వార్నింగ్ షాట్ ఫైరింగ్ చేయాల్సి వచ్చిందంటూ చైనా చేసిన ప్రకటనను ఆర్మీ అధికారులు తోసిపుచ్చారు. చైనా చేసిన ప్రకటనల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులకు పూర్తి భిన్నమైన ప్రకటన చేశారని తెలిపారు.

గాల్లోకి కాల్పులు జరిపి.. బెదిరింపులకు
సంఘటనా స్థలంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు దూకుడుగా వ్యవహరించాయని ఆర్మీ అధికారులు తెలిపారు.
సరిహద్దుల్లో పహారా కాస్తోన్న ఫార్వర్డ్ పొజిషన్ జవాన్లతో చైనా సైనికులు కవ్వింపు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారని వెల్లడించారు. ఎల్ఏసీని దాటుకుని భారత భూభాగంపైకి దూసుకుని రావడానికి ప్రయత్నించారని అన్నారు. ఈ సందర్భంగా చైనా సైనిక బలగాలు గాల్లోకి పలుమార్లు కాల్పులు జరిపి, భారత జవాన్లను బెదిరించినట్లు తెలిపారు. అయినప్పటికీ.. భారత జవాన్లు చెక్కు చెదరలేదని, వారికి ధీటుగా నిల్చున్నారని పేర్కొన్నారు.

గీత వెనుకే..
చైనా బలగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ.. భారత జవాన్లు సంయమనాన్ని ప్రదర్శించారని చెప్పారు. జవాన్లు సరిహద్దులను దాటే ప్రయత్నం చేయలేదని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చైనా సైనికులు ప్రవర్తించారని పేర్కొన్నారు. సరిహద్దు వివాదాలను శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవడంపైనే తాము దృష్టి పెట్టామని, దీనికి భిన్నంగా చైనా వ్యవహరిస్తోందని అన్నారు. సైనిక, విదేశాంగ, రాజకీయ కోణాల్లో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నామని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.

సంయమనం అద్భుతం..
చైనా సైనికులు రెచ్చిపోయినప్పటికీ.. భారత జవాన్లు అద్భుతమైన సంయమనాన్ని ప్రదర్శించారని అన్నారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి తాము చిత్తశుద్ధితో ఉన్నామనడానికి జవాన్లు చూపిన సంయమనమే నిదర్శనమని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ దేశ సమగ్రతను, సార్వభౌమత్వానికి విఘాతం కలగనివ్వబోమని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. చైనా చేసిన వాదనలను తాము ఏ మాత్రం అంగీకరించట్లేదని తేల్చి చెప్పారు. చర్చల ద్వారా పరిష్కారానికే మొగ్గు చూపుతున్నామని పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications