ఈశాన్యంలో రక్తపాతం: ప్రధాని మోదీపై మణిపూర్ సీఎం బీరేన్ కీలక వ్యాఖ్యలు -బీజేపీలోకి మాజీ పీసీసీ చీఫ్
ఈశాన్య భారతంలో రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం హింసాత్మకంగా మారి రక్తపాతం చోటుచేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాత్రపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అస్సాం, మిజోరం సరిహద్దులో జరిగిన ఘర్షణలో ఆరుగు పోలీసులు, ఒక పౌరుడు మరణించడం, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సహా మరో ఆరుగురు ఉన్నతాధికారులపై మిజోరం పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం లాంటి ఘటనలు పరిస్థితిని ఇంకాస్త దిగజార్చాయి. ఈశాన్యంలో వివాదాలకు కేంద్రం తీరే కారణమని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, సదరు విమర్శలు శుద్ధ తప్పని, ఈశాన్యంపై ప్రధాని మోదీకి వల్లమానిన అభిమానం ఉందని కమలనాథులు వాదిస్తున్నారు..
ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య ప్రాంతంపై అధిక శ్రద్ధ వహిస్తున్నారని, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ఆయన ప్రత్యేక చొరవ చూపుతున్నారని మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అన్నారు. మణిపూర్ మాజీ పీసీసీ చీఫ్ గోవిందాస్ కొంతౌజమ్ ఆదివారం బీజేపీలో చేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈశాన్య ప్రాంతానికి చెందిన ఐదుగురిని తాజాగా కేబినెట్లోకి తీసుకోవడం మోదీ శ్రద్ధకు ఒక ఉదాహరణ అని, మోదీ సర్కారును మరింత దృఢంగా తీర్చిదిద్దడానికి ఈశాన్య ప్రజలు సిద్ధంగానే ఉన్నారని మణిపూర్ సీఎం అన్నారు. అంతేకాదు,

నరేంద్ర మోదీ హయాంలోనే ఈశాన్యంలో శాంతి ఏర్పడిందన్న బీరేన్ సింగ్.. గత కాంగ్రెస్ హయాంలో మణిపూర్లో నిత్యం ఉద్యమాలు జరుగుతూ ఉండేవని, ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే మణిపూర్ శాంతియుతంగా మారిందని బీరేన్ అన్నారు. ''నేను కూడా కాంగ్రెస్లో పనిచేశా. కానీ... డ్రైవర్ నిద్రపోతే బండిని ఎవరు నడుపుతారు, బండి ఎలా ముందుకు కదులుతుంది?'' అంటూ కాంగ్రెస్ పై మండిపడ్డారు సీఎం బీరేన్. కాగా,
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ చీఫ్ గోవిందాస్ కొంతౌజమ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం నాడు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సీఎం బీరేన్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. గోవిందాస్ సహా ఇంకొందరు ముఖ్యనేతలు గత నెల చివరి వారంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వారి చేరికతో బీజేపీకి మరింత బలం చేకూరినట్లయిందని సీఎం బీరేన్ అన్నారు. కాగా, అస్సాం, మిజోరం సరిహద్దులో రక్తపాతం చోటుచేసుకున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి మణిపూర్ పీసీసీ చీఫ్, ఇంకొందరు కీలక నేతలు గుడ్ బై చెప్పడం, వారంతా బీజేపీలో చేరిపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications