బుందేల్ ఖండ్పై మోడీ వరాల జల్లు.. రూ.20 వేల కోట్ల ప్యాకేజ్, రక్షణ కారిడార్
లక్నో: అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్లోని బుందేల్ ఖండ్పై బుధవారం ప్రధాని మోడీ వరాల జల్లు కురిపించారు. ఆ ప్రాంత అభివృద్ధి కోసం రూ.20 వేల కోట్ల ప్యాకేజ్తోపాటు రక్షణ పారిశ్రామిక కారిడార్ను కూడా ఆయన ప్రకటించారు.
బుధవారం లక్నోలో నిర్వహించిన ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్ సమ్మిట్-2018 కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, అందుకే బడ్జెట్ లో ప్రస్తావించిన రెండు రక్షణ కారిడార్లలో ఒకదాన్ని బుందేల్ ఖండ్ కు కేటాయించామని తెలిపారు.
యూపీలో పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాటుపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. 'ఒక రాష్ట్రం ఒక ఉత్పత్తి' అనే కొత్త పాలసీని ఆయన ప్రశంసించారు. రక్షణ కారిడార్ కేటాయింపుతో రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు 2.5 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని మోడీ చెప్పారు. జేవార్, కుశినగర్ ప్రాంతాల్లో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయాలు వస్తాయని అన్నారు.
ఒకవైపు విభజన హామీలు అమలు చేయాలంటూ ఏపీలో ఉవ్వెత్తున ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ సమస్యలు తీర్చకుండానే బుందేల్ ఖండ్పై వరాలు కురిపించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమకు న్యాయం చేయాలని ఇంత ఆందోళన చేస్తున్నా... పట్టించుకోని మోడీ బుందేల్ ఖండ్కు రూ.20 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించడం ఏపీ ప్రజల్ని మరింత ఆగ్రహానికి గురిచేయక మానదనే వ్యాఖ్యనాలు వినిపిస్తున్నాయి.