‘అటల్ భూజల్ పథకం’ ప్రారంభించిన ప్రధాని మోడీ: రూ. 600 కోట్ల కేటాయింపు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 95వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోపాటు పలువురు కేంద్రమంత్రులు, నేతలు బుధవారం అటల్ సమాధి స్థల్ వద్ద ఆయనకు నివాళులర్పించారు.
అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ రూ. 600 కోట్ల ఖర్చుతో కూడిన గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ స్కీం 'అటల్ భూజల్ పథకం 'ను ప్రారంభించారు. ఇప్పటికే ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా సాంకేతికతను ఉపయోగించి నీటి వృథాను తగ్గించడం కూడా జరుగుతుంది. వ్యవసాయ రంగానికి ఉపయోగపడేలా ఈ పథకం ఉండనుంది.

2020-2025 వరకు ఐదేళ్లలో ఈ పథకాన్ని పూర్తి చేయనున్నారు. గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ఎంపిక చేసిన జిల్లాల్లో మొదట ఈ పథకాన్ని అమలు చేస్తారు. 78 జిల్లాల్లోని 8350 గ్రామ పంచాయతీలు ఈ పథకం వల్ల లబ్ధిపొందనున్నాయి.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. మూడుసార్లు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వాజపేయికి ఆయన మాటలకంటే మౌనమే శక్తివంతమైనదని అన్నారు. అటల్ జీ గురించి చాలా చెప్పవచ్చునని.. ఆయకు ఎప్పుడు నిశ్చబ్దంగా ఉండాలో.. ఎప్పుడు మాట్లాడాలో బాగా తెలుసు అని అన్నారు.
రోహ్తంగ్కు వాజపేయి పేరు
హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత వ్యూహాత్మక సొరంగ మార్గమైన రోహ్తంగ్కు ప్రభుత్వం మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి పేరు పెట్టనుంది. బుధవారం వాజపేయి జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. కాగా, వాజపేయి ప్రధాని ఉన్న 2000 సంవత్సరం జూన్ 3న రోహ్తంగ్ మార్గం నిర్మాణానికి నిర్ణయం జరగడం గమనార్హం.












Click it and Unblock the Notifications