కరోనా ‘మూడో’ ముప్పుపై ప్రజలకు మోడీ హెచ్చరిక: 1500 ఆక్సిజన్ల ప్లాంట్ల ఏర్పాటు, కీలక సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఇలాగే కొనసాగితే మూడో ముప్పుతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా నిబంధనలను పూర్తిగా సడలించవద్దని, పరిస్థితులకు తగినట్లు వ్యవహరించాలని సూచించారు.

మూడో ముప్పు పట్ల కేంద్రం అప్రమత్తం
మరికొద్ది నెలల్లో కరోనా మూడో ముప్పు పొంచివుందని వైద్య నిపుణులు పేర్కొంటున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందే అప్రమత్తమైంది. సెకండ్ వేవ్లో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న నేపథ్యంలో దేశంలో ఆక్సిజన్ కొరత లేకుండా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూనే కరోనాకు సంబంధించిన మందులు, ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటోంది.

1500 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు మోడీ ఆదేశం
శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మెడికల్ ఆక్సిజన్ నిల్వలు, సరఫరాపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా 1500 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. పీఎం-కేర్స్ సహకారంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఆక్సిజన్ లభ్యత, ప్లాంట్ల నిర్మాణంపై ప్రధాని సమీక్షించారు.

4 లక్షలకుపైగా బెడ్లకు ఆక్సిజన్ అందుబాటులోకి..
పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే 4 లక్షలకుపైగా ఆక్సిజనేటెడ్ బెడ్లకు ఆక్సిజన్ అందించేందుకు వీలవుతుందని అధికారులు ఈ సందర్భంగా మోడీకి తెలిపారు. వీలైనంత త్వరగా ఆక్సిజన్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను ప్రధాని మోడీ ఆదేశించారు. ఆక్సిజన్ కేంద్రాల నిర్వహణపై ఆస్పత్రి సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని ప్రధాని సూచించారు. వాటి పనితీరు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా అధునాతన సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు.
Recommended Video

మూడో ముప్పు పొంచివుంది.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న మోడీ
దేశం నుంచి కరోనా ఇంకా పూర్తిగా పోలేదని, ప్రజలు కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరోసారి మహమ్మారి విజృంభించే అవకాశాలు లేకపోలేదని దేశ ప్రజలను ప్రధాని హెచ్చరించారు. వ్యాక్సిన్ తీసుకోవాలని, కరోనా నిబంధనలు పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మూడో ముప్పు పొంచివున్న క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రాలు కూడా కరోనా నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే నిబంధనలను మరింత కఠినతరం చేయాలని రాష్ట్రాలకు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications