వాజ్ పేయి కల నిజం చేస్తాం, జేడీఎస్ తో కలిసేది లేదు, ఇందిరా గాంధీ కాలం: ప్రధాని మోడీ ఫైర్!
తుమకూరు/బెంగళూరు: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పేదలు, శ్రీమంతులు అంటూ మాటలు చెబుతుందని, ఎన్నికల పూర్తి అయిన తరువాత పేదలను పట్టించుకోవడం ఆ పార్టీ మరిచిపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. శనివారం తుమకూరులో బీజేపీ బహిరంగ సభ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ తీరుపై విమర్శలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడి ప్రజలకు ఏం చేసిందని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి కలలు కన్న హేమావతి, నేత్రావతి నదులను అనుసంధానం చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తుమకూరు జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ వరాలు మంత్రుల ఖజానా
ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రజలకు ఏమి చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. అవినీతి, రైతుల ఆత్మహత్యలు లాంటి వరాలు కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రజలకు ఇచ్చిందని నరేంద్ర మోడీ విమర్శించారు. అయితే మంత్రులు ఖజనా మాత్రం పూర్తిగా నిండిపోయిందని, అది ఎలా సాధ్యం అయ్యిందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు.

తెరవెనుక కాంగ్రెస్, జేడీఎస్
తెరవెనుక కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు మంతనాలు జరుపుతున్నాయని ప్రధాని మోడీ ఆరోపించారు. అందుకు నిదర్శనం బీబీఎంపీ (బెంగళూరు)లో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఒక్కటై మేయర్, ఉపమేయర్ పదవులు పంచుకున్నాయని, ఈ విషయం బహిరంగంగా అందరికీ తెలిసినా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు మాత్రం ప్రజలను మోసం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.

20 లక్షల హెక్టార్లకు నీరు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కలలు కన్న హేమావతి, నేత్రావతి నదులు అనుసంధానం పథకం త్వరలో అమలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తుమకూరు జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. రెండు నదులు అనుసంధానం చేసి ప్రజలకు నీటి కష్టాలు తీర్చుతామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చిన్ననీటి పారుదల శాఖ నుంచి ఇప్పటికే 20 లక్షల హెక్టార్ల భూమికి నీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

రూ. 836 కోట్లు ఇస్తే రూ. 12 కోట్లు ఖర్చు
కర్ణాటకలో 7 స్మార్ట్ సిటీల అభివృద్దికి రూ. 14 వేల కోట్లు కేటాయించామని, అందులో రూ. 836 కోట్లు మంజూరు చేశామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కర్ణాటకలోని 7 స్మార్ట్ సిటీల్లో తుమకూరు కూడా ఉందని ప్రధాని మోడీ చెప్పారు. అయితే సిద్దరామయ్య ప్రభుత్వం తన స్వార్థం కోసం స్మార్ట్ సిటీలను అభివృద్ది చెయ్యకుండా కేవలం రూ. 12 కోట్లు మాత్రం ఖర్చు చేసి మిగిలిన నగదు అలాగే పెట్టేశారని ప్రధాని మోడీ విమర్శించారు.

మఠాలు, స్వామీజీలకే సాధ్యం
తుమకూరులోని సిద్దగంగ మఠం దర్శించి స్వామీజీ ఆశీస్సులు తీసుకోవడం ఆనందంగా ఉందని, అక్కడ అక్షర దాసోహం, అన్నదాసోహంతో ప్రజలకు ఎనలేని సేవ చేస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. దేశం అభివృద్ది చెందడానికి మఠాలు, స్వామీజీలు ఎంతగానో సహకరిస్తున్నారని, వారి సేవలకు విలువ కట్టలేమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.

దేవేగౌడ ఆత్మహత్య
2014లో తాను ప్రధాని అయితే మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అత్మహత్య చేసుకుంటానని అన్నారని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. అయితే తాను ప్రధాని అయ్యాయని, హెచ్.డి. దేవేగౌడ ఆత్మహత్య చేసుకోవల్సిన అవసరం లేదని, ఆయన అంటే తనకు గౌరవం ఉందని ప్రధాని మోడీ మర్యాదగానే ఆయనకు చురకలు అంటించారు.

ఒక్క అవకాశం ఇవ్వండి
కర్ణాటకలోని సిద్దరామయ్య అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి బీజేపీకి ఓటు వెయ్యాలని ప్రధాని నరేంద్ర మోడీ మనవి చేశారు. ప్రజలు, రైతులు కష్టాలు తీర్చాలంటే బీఎస్. యడ్యూరప్పను ముఖ్యమంత్రిని చెయ్యాలని, అందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు మనవి చేశారు.












Click it and Unblock the Notifications