మీరే అందరికీ స్ఫూర్తి: శానిటేషన్ వర్కర్ల పాదాలు కడిగిన ప్రధాని మోడీ (వీడియో)
ప్రయాగ్రాజ్: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం శానిటేషన్ వర్కర్ల పాదాలు కడిగారు. ఆయన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్లో కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'స్వచ్ఛ్ కుంభ్, స్వచ్ఛ అభర్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇద్దరు మహిళ సహా ఐదుగురు శానిటేషన్ వర్కర్ల కాళ్లు కడిగారు.
ఐదుగురు వర్కర్లను కుర్చీల పైన కూర్చోబెట్టి, వారి కాళ్లను తాంబాళంలో ఉంచి చెంబు పట్టుకొని నీళ్లతో కడిగారు. మొత్తే ఐదుగురి కాళ్లు కడిగారు. అనంతరం తువ్వాలుతో వారి కాళ్లు కూడా తుడిచారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్గా మారాయి. ప్రయాగ్రాజ్లో అర్ధ కుంభభమేళా ఆరంభమైనప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు శానిటేషన్ వర్కర్లు పని చేస్తున్నారు. సెలవు లేకుండా పని చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ వారికి పాదాలు కడగాలని, సన్మానించాలని నిర్ణయం తీసుకున్నారు..

#WATCH: Prime Minister Narendra Modi washes feet of sanitation workers in Prayagraj pic.twitter.com/otTUJpqynU
— ANI UP (@ANINewsUP) February 24, 2019
అనంతరం మోడీ మాట్లాడారు. వచ్చే అక్టోబర్ 2 (2019) నాటికి స్వచ్ఛ భారత్గా మరింత ముందుకు వెళ్తుందని చెప్పారు. కుంభమేళాలో పరిశుభ్రం చేస్తున్న స్వచ్చాగ్రహిలు (కుంభమేళాలో శుభ్రం చేస్తున్నవారు) మొత్తం భారతదేశానికి స్ఫూర్తిదాయకం అని చెప్పారు.
తనకు ఇటీవల సియోల్ శాంతి బహుమతి వచ్చిందని, దీనికి వచ్చిన మొత్తాన్ని తాను గంగమ్మ తల్లి పరిశుభ్రత కోసం ఇచ్చానని చెప్పారు. గత నాలుగేళ్లుగా తనకు అవార్డుల ద్వారా వచ్చిన మొత్తాన్ని ఈ కార్యక్రమం కోసమే ఇచ్చానని చెప్పారు.
తాను శానిటేషన్ వర్కర్ల పాదాలు కడిగిన విషయం ఎప్పటికీ గుర్తుకు ఉంటుందని మోడీ అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ వారు తనతోనే ఉంటారని చెప్పారు. అలాగే వారీ ఆశీర్వాదాలు తనకు జీవితాంతం ఉంటాయని చెప్పారు.
పుణ్యస్నానం ఆచరించిన మోడీ
అంతకుముందు, ప్రధాని మోడీ ప్రయాగ్ రాజ్ కుంభమేళా వద్ద పూజలు చేశారు. గంగానదిలో పుణ్యస్నానం ఆచరించారు. తాను పుణ్యస్నానం ఆచరించిన వీడియోను ట్వీట్ చేస్తూ... 130 కోట్లమంది ప్రజలు బాగుండాలని కోరుకున్నానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications