పీఎన్బీ స్కాం: కీలక నిందితుడి అరెస్ట్: మోడీ ఆస్తులపై సీబీఐ, ఈడీ కొరడా
Recommended Video
ముంబై: దేశ బ్యాంకింగ్ రంగంలోనే సంచలనమారిన పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) రూ.11వేల కోట్ల కుంభకోణానికి సంబంధించిన కీలకమైన వ్యక్తిని శనివారం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
రూ.11వేల కోట్ల మోసానికి రూ.2కోట్ల బీమానా!: పీఎన్బీకి తప్పని భారీ మూల్యం?
కేసులో కీలకమైన నిందితుడైన పీఎన్బీ మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్నాథ్ శెట్టి, ఎస్డబ్ల్యూఓ(సింగిల్ విండో ఆపరేటర్) మనోజ్ కారట్, నీరవ్ మోడీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చెందిన అధికారి హేమంత్ భట్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మోడీకి సాయం చేసిన శెట్టి
ఈ ముగ్గురినీ ముంబైలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నారు. రూ.11వేల కోట్ల కుంభకోణంలో నీరవ్ మోడీకి శెట్టి సహాయం చేసినట్లు అధికారులు తెలిపారు. శెట్టి ఇంట్లో గురువారం, శుక్రవారం సీబీఐ అధికారులు పలు సోదాలు జరిపారు. ఈ ముగ్గురుపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, అతడి భాగస్వామి మెహుల్ చోక్సీలు.. పీఎన్బీకు రూ.11,400కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన విషయం తెలిసిందే.
ఇప్పటికే పాస్ పోర్టుల రద్దు
చోక్సీకి చెందిన గీతాంజలి సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్ర, శనివారాల్లో వరుసగా దాడులు చేపట్టారు. ఇప్పటికే వీరిద్దరి పాస్పోర్టులను విదేశాంగ శాఖ తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ కేసు వెలుగులోకి రాక ముందే వీరిద్దరూ విదేశాలకు చెక్కేశారు. దేశం విడిచి వెళ్లిపోయిన నీరవ్, చోక్సీల ఆచూకీ కోసం సీబీఐ అధికారులు ఇంటర్పోల్ అధికారుల సహాయం కోరారు.
ఒకేసారి దాడులు
కాగా, పీఎన్బీ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన డైమాండ్ కింగ్ నీరవ్ మోడీపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు, సీబీఐ, ఈడీ అధికారులు కూడా కొరడా ఝుళిపిస్తున్నారు. రెండ్రోజుల దాడుల్లో రూ.5100 కోట్ల వజ్రాలు, ఆభరణాలు, బంగారాన్ని సీబీఐ అధికారులు సీజ్ చేయగా.. శనివారం ఆదాయపు పన్ను శాఖ కూడా ఆయన ఆస్తులు, బ్యాంకు అకౌంట్లను అటాచ్ చేసింది. పన్ను ఎగవేత విచారణ కింద నీరవ్ మోడీ, ఆయన కుటుంబ సభ్యులు, సంస్థలకు చెందిన 29 ఆస్తులను, 105 బ్యాంకు అకౌంట్లను అటాచ్ చేసినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు పేర్కొన్నారు.
యాంటీ2 బ్లాక్ మనీ యాక్ట్ ప్రయోగం
అంతేకాక విదేశాల్లో ఆయన అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్టు ఆరోపిస్తూ... ఆయనపై యాంటీ-బ్లాక్ మనీ యాక్ట్ను ప్రయోగించారు. ఈ ఆస్తులు సింగపూర్లో ఉన్నట్టు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. కొత్త చట్టం కింద లెక్కలో చూపించని విదేశీ ఆస్తులు, ఆదాయంపై 120 శాతం పన్ను వేస్తారు. అంతేకాక 10 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్స్ 276 సీ(1), 277 ఏ, 278 బీ, 278 ఈ కింద మోడీకి వ్యతిరేకంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఛార్జ్షీటు దాఖలు చేశారు. ఫిబ్రవరి 27 ఈ కేసును కోర్టు విచారించనుంది.
ఆస్తుల అటాచ్
సూరత్, ముంబై, జైపూర్, ఢిల్లీలో ఉన్న నీరవ్ మోడీ, ఆయన భార్య ఆమీ, సంస్థలకు చెందిన స్థిరాస్తులకు పన్ను అధికారులు ఈ అటాచ్మెంట్ నోటీసు పంపారు. మోడీ, ఆయన కుటుంబం, కంపెనీలకు చెందిన మొత్తం 105 బ్యాంకు అకౌంట్లను అటాచ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. మోడీకి మొత్తం 150 షెల్ కంపెనీలతో లింక్లున్నట్టు కూడా అధికారులు గుర్తించారు.