దర్యాప్తు చేపట్టిన అధికారే బాలికను రేప్ చేసి హత్య చేశాడు
శ్రీనగర్: కనిపించకుండా పోయిన బాలికను గుర్తించి, అప్పగించాల్సిన అధికారే అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. బాలిక అదృశ్యం కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి ఆ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను హత్య చేశాడు.
కేసును దర్యాప్తు చేస్తున్న క్రైమ్ బ్రాంచ్ ఈ దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించింది. జమ్ముకి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో గల కతువా జిల్లాలోని రసానా గ్రామంలో సంచార జాతికిచెందిన ఓ బాలిక అదృశ్యమైంది.
గత నెలలో బాలిక అదృశ్యం
గత నెల 10వ తేదీ నుంచి ఎనిమిదేళ్ల వయస్సు గల బాలిక కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు నాలుగు రోజుల పాటు గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో కేసును పర్యవేక్షించే బాధ్యతను హీరానగర్ ఎస్పీవో దీపక్ ఖుజారీయాకు అప్పగించారు.
అయినా కూడా ఫలితం లేదు..
ఖుజారియాకు అదృశ్యం కేసును అప్పగించినా ఫలితం కనిపించలేదు. కాగా, వారం రోజుల తర్వాత శివారులోని పొలాల్లో బాలిక శవం కనిపించింది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, బాలికపై అత్యాచారం జరిగిందని తెలియడంతో సంచార తెగ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకింది. రోడ్డు మీదికి వచ్చి ధర్నా చేశారు.
ఇలా కేసు మిస్టరీ వీడింది..
ఆందోళన కారణంగా పోలీసు శాఖ కేసు నుంచి దీపక్ ఖుజారియాను తప్పించి క్రైమ్ బ్రాంచ్కు అప్పగించారు. బాలికను దీపక్ ఖుజారియా వారం రోజుల పాటు బంధించి, అత్యాచారం చేసి, ఆమెను హత్య చేశాడని దర్యాప్తులో తేలింది. ఇందుకు ఓ బాలుడు సహకరించినట్లు భావిస్తున్నారు.
అతనిపై పక్కా ఆధారాలు
28 ఏళ్ల దీపక్ ఖుజారియా ఆ నేరం చేశాడని రుజువు చేయడానికి పక్కా ఆధారాలు సేకరించామని, నిందితుడు కూడా నేరాన్ని అంగీకరించాడని పోలీసులు అంటున్నారు. పక్కా ప్రణాళికతోనే అతను ఈ నేరం చేశాడని, దీని వెనక బలమైన కారణం ఉందని అంటున్నారు.
మొదటి నుంచీ అనుమానాలే...
కేసు దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి దీపక్ ఖుజారియాపై బాధిత కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. విచారణలో అసత్వం ప్రదర్శించడం, ప్రశ్నించిన పాపానికి కుటుంబ సభ్యులపై, గ్రామస్థులపై దాడి చేయడం వంటి ఘటనల వల్ల వారు అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు.