ప్రీతిది పరువు హత్యే: నిందితుడు పన్వర్, ఉరితీయాలన్న తండ్రి
ముంబై: యాసిడ్ దాడిలో మృతిచెందిన ముంబై నర్సు ప్రీతి రాఠీ కేసులో ఆమె పొరుగింటి వ్యక్తి అంకుర్ పన్వార్ను ముంబై కోర్టు దోషిగా తేల్చింది. అతడికి బుధవారం శిక్ష ఖరారు చేయనుంది. అయితే మరి కొద్ది గంటల్లో శిక్ష పడుతుందనగా.. ప్రీతి కుటుంబంపై అంకుర్ సంచలన ఆరోపణలు చేశాడు. ప్రీతిని తాను చంపలేదని, ఆమెది పరువు హత్యేనని ఆరోపించాడు.
అంతేగాక, 'ఈ కేసులో నన్ను కావాలనే ఇరికిస్తున్నారు. ప్రీతి తండ్రి బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెది పరువు హత్య మాత్రమే. అది దాచేందుకే అసూయతో నేనే చంపానని చెబుతున్నారు. ఎవరైనా ఓ అమ్మాయిని వెంబడిస్తూ.. ఢిల్లీ నుంచి ముంబై దాకా టికెట్ లేకుండా ప్రయాణించగలరా? ఒక్క అసూయ కారణంగా ఎవరైనా యాసిడ్తో దాడి చేస్తారా?' అంటూ అంకుర్ న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించాడు.
ఇదంతా కేవలం కుట్రేనని.. ఈ కేసులో తిరిగి విచారణ చేయాలని పన్వార్ డిమాండ్ చేశాడు. కాగా, ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని, తమ కుమారుడికి న్యాయం జరిగేదాకా తాము పోరాడుతామని అంకుర్ తల్లి చెబుతోంది. మరోవైపు అంకుర్ ఆరోపణలను ప్రీతి తండ్రి అమర్ సింగ్ రాఠీ కొట్టిపారేశారు.
తానే ఈ పనిచేసినట్లు అంకుర్ తన ముందు ఒప్పుకున్నాడని అమర్ మీడియాకు వెల్లడించారు. ప్రీతి తన పనేదో తాను చేసుకునే అమ్మాయని, తనకు ఉద్యోగం వచ్చిందని తెలిసి ఎంతో ఆనందం వ్యక్తం చేసిందని ప్రీతి తండ్రి తెలిపారు. 15వేల మందిలో పోటీ పడి లెఫ్ట్ నంట్ నర్సు ఉద్యోగం సాధించిందని చెప్పారు. ఎంతో సంతోషంగా తాను ఉద్యోగంలో చేరేందుకు వెళుతుండగా ఈ ఘోరం జరిగిందని అమర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఢిల్లీకి చెందిన ప్రీతి రాఠీకి 2013లో ముంబైలోని నేవీ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగం వచ్చింది. దీంతో 2013, మే2న ఉద్యోగంలో చేరడానికి ఆమె తండ్రితో కలిసి రైలులో ఢిల్లీ నుంచి ముంబై వచ్చారు. రైలు దిగి ప్రీతి తండ్రితో కలిసి నడిచి వెళ్తుండగా అంకుర్ పన్వార్ ఆమెను భుజంపై తట్టడంతో వెనక్కి తిరిగి చూసింది. అతడు వెంటనే ముఖంపై యాసిడ్ పోసి పరారయ్యాడు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రీతి.. నెలరోజుల పాటు చికిత్స పొంది జూన్ 1న మృతి చెందింది. అంకుర్ ఢిల్లీలో తనను వేధించాడని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని ప్రీతి ఆస్పత్రిలో చికిత్స సమయంలో తన స్నేహితురాలికి చెప్పింది.
ఈ కేసులో విచారణ చేపట్టిన న్యాయస్థానం అంకుర్ను దోషిగా నిర్ధారిస్తూ.. మంగళవారం తీర్పు చెప్పింది. పక్కింట్లో ఉండే ప్రీతికి నేవీలో ఉద్యోగం రావడం.. అతడిని ఉద్యోగం సంపాదించుకోవాలని ఇంట్లో తిడుతుండడం వల్ల ఆమెపై అసూయ పెరిగి యాసిడ్ దాడి చేసినట్లు పోలీసులకు కోర్టుకు వివరించారు.
కాగా, తన కూతురు మరణానికి కారణమైన అంకుర్ పన్వార్కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు అమర్ సింగ్ రాఠి. అంకుర్ యాసిడ్ దాడి చేయడంతో అమర్ సింగ్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఆయన చేయి కొంత కాలిపోయింది.