Sonia Gandhi:"రాష్ట్రపతి బాగా అలసిపోయారు".. సోనియా వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం
Sonia Gandhi: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా గాంధీని మీడియా పలకరించగా.. "ప్రసంగం చివరి వరకు వచ్చేసరికి రాష్ట్రపతి అలసిపోయి, ఆమె మాట్లాడలేకపోయారు." అంటూ సోనియా సమాధానమిచ్చారు.
సోనియా వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. కాంగ్రెస్ ఎంపీ అలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది. పార్లమెంట్ సమావేశాలను ప్రారంభిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గంటసేపు ప్రసంగించారని.. కానీ ఎక్కడా అలసిపోలేదు అని రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రపతి గౌరవాన్ని దెబ్బతీశాయని, సత్యానికి దూరంగా ఉన్నాయని ప్రకటన పేర్కొంది. "రాష్ట్రపతి ఏ సమయంలోనూ అలసిపోలేదు. అణగారిన వర్గాల కోసం, మహిళలు, రైతుల కోసం మాట్లాడడంలో రాష్ట్రపతి ఎప్పుడూ అలసిపోరు." అని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. పేరు చెప్పకుండా.. నాయకులకు హిందీ వంటి భారతీయ భాషలలోని యాస, ఉపన్యాసంతో పరిచయం కలిగి ఉండకపోవచ్చు కాబట్టి వారు తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారని ప్రకటన పేర్కొంది.

సోనియా వ్యాఖ్యలను బీజేపీ కూడా తప్పుపట్టింది. ఇవి అభ్యంతరకర వ్యాఖ్యలు అని.. సోనియా, రాహుల్ వంటి నేతలు ఇలాంటి మాటలు మాట్లాడకూడదని బీజేపీ ఎంపీ సుకంతా మజుందార్ విమర్శించారు. మరీ ముఖ్యంగా రాష్ట్రపతిని ఉద్దేశించి చేయకూడదన్నారు. ఆదీవాసీ కుటుంబం నుంచి వచ్చిన ద్రౌపదీ ముర్ము.. రాష్ట్రపతిగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ జమిందారీ మైండ్ సెట్ ఆ విషయాన్ని అంగీకరించలేకపోతోందని.. అందుకే వారు ప్రసంగాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications