అద్వానీకి మోడీ పాదాభివందనం: మన్మోహన్ రాజీనామా
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బిజెపి పార్లమెంటరీ సమావేశంలో పార్టీ అగ్రనేత ఎల్కె అద్వానీకి పాదాభివందనం చేశారు. ఆ తర్వాత మోడీని అద్వానీ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మోడీని బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ గజమాలతో సత్కరించారు. పార్టీ సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, తదితరులు మోడీకి అభినందనలు తెలిపారు.పార్టీకి ఘన విజయం సాధించి పెట్టినందుకు బిజెపి పార్లమెంటరీ బోర్డు అభినందించింది. పార్లమెంటరీ బోర్డు సమావేశానంతరం బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఆయనతో పాటు నరేంద్ర మోడీ, అగ్రనేత ఎల్కె అద్వానీ, సీనియర్ నేత సుష్మా స్వరాజ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మీడియా సమావేశంలో మోడీ రెండు మూడు మాటలే మాట్లాడారు. ఎన్నికల మహా పర్వంలో తన పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.
బిజెపికి తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టినందుకు రాజ్నాథ్ సింగ్ భారత ప్రజలకు, అన్ని వర్గాలకు కృతజ్ఝతలు చెప్పారు. బిజెపికి విజయాన్ని సాధించి పెట్టినందుకు మోడీని పార్లమెంటరీ అభినందించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగతుందని, ఈ సమావేశంలో మోడీని నేతగా లాంచనంగా ఎనుకుంటామని ఆయన చెప్పారు.
భారత ప్రజలు మోడీని ప్రధానిగా స్వీకరిస్తున్నారని ఆయన అన్నారు. మోడీ ప్రమాణ స్వీకారం చేసే తేదీని పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాతనే నిర్ణయిస్తామని చెప్పారు. స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెసేతర పార్టీ తిరుగులేని విజయం సాధించడం ఇదే మొదటిసారి అని చెప్పారు. గుజరాత్ శాసనసభా పక్ష నేత ఎంపిక ప్రక్రియ జరుగుతోందని ఆయన చెప్పారు.

పార్లమెంటరీ బోర్డు సమావేశంలో మంత్రి మండలి, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. సమావేశానికి ముందు నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల కృషి వల్లే కమలం వికసించిందని తెలిపారు. ఈ విజయం బిజెపిదే కాదు దేశ ప్రజలందరిదీ అని ఆయన అన్నారు. ర్యాలీలో భారీ సంఖ్యలో బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రపతికి రాజీనామా సమర్పించిన మన్మోహన్
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని మన్మోహన్ సింగ్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. మంత్రి మండలిని రద్దు చేయాలని రాష్ట్రపతికి వినతి పత్రం అందజేశారు. కాగా, మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగారు. 2004 నుంచి రెండు పర్యాయాలు ప్రధానికి మన్మోహన్ సింగ్ ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications