ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా గుజరాత్ కు ప్రధాని మోడీ ఇచ్చిన కానుక??
గుజరాత్ లో చోటుచేసుకున్న బిల్కిస్ బానో పై అత్యాచార కేసు దోషులను విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రధానమంత్రి మోడీ చెప్పిన మాటలు, చేస్తున్న పనుల మధ్య తేడాను దేశం గమనిస్తోందని, 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోడీ చేసిన ప్రసంగంలో నారీ శక్తి గురించి మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. మహిళలకు గౌరవం విషయంలో మోడీ మాటలకు, చేతలకు పొంతన లేదన్నారు.
5 నెలల గర్భిణిపై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా ఆమె మూడు సంవత్సరాల చిన్నారిని కూడా చంపేశారు. అటువంటివారిని ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేళ విడుదల చేశారు. మహిళా శక్తి గురించి మాట్లాడేవారు దేశ మహిళలకు ఇచ్చే సందేశం ఏమిట? మీ మాటలు, చేతల తేడాను దేశం చూస్తోందని ట్వీట్ చేశారు. మహిళలను కించపరిచే పనులు చేయబోమని ప్రతిజ్ఞ చేయాలంటూ ఎర్రకోట ప్రసంగంలో పిలుపునిచ్చిన మోడీ.. చేసే పనులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయని మండిపడ్డారు.
గ్యాంగ్ రేప్ కేసులో దోషులను విడుదల చేయడం అన్యాయం, బాధితులను కించపరిచినట్లు కాదా? అని ప్రియాంకగాంధీ ప్రశ్నించారుు. మహిళలపై గౌరవం ప్రసంగాల్లోనేనా అని ప్రజలు అడుగుతున్నారని, మోడీకి చిత్తశుద్ధి ఉంటే అత్యాచార కేసులో దోషుల విడుదల విషయంలో గుజరాత్ ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోవాలని టీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా వ్యాఖ్యానించారు.
బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో 11 మంది దోషులను విడుదల చేయడాన్ని గుజరాత్ ప్రభుత్వం సమర్థించుకుంది. 1992 నాటి రెమిషన్ విధానం కింద వీరిని విడుదల చేసినట్లు ప్రకటించింది. జీవితఖైదు అనుభవిస్తున్న దోషులంతా విడుదల కావడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.