కాంగ్రెస్లో ఓటమి అలజడి: నరేంద్రమోడీపై కొత్త ఎత్తుగడ
ముంబై: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెసు పార్టీ తాజాగా కొత్త ఎత్తుగడలో ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇది బయటకు చెప్పనప్పటికీ కాంగ్రెసు పార్టీలో లోలోన భయం కనిపిస్తోంది. అయితే, ఎన్డీయే అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. మాజిక్ ఫిగర్ (272) సీట్లు దాటితేనే మోడీకి సులభమవుతుంది. కొన్ని సీట్లు తగ్గితే మాత్రం మోడీకి కష్ట సాధ్యమవుతుంది.
ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమికి ఎక్కువ సీట్లు వచ్చి... మేజిక్ ఫిగర్ దాటని పక్షంలో మోడీని ప్రధానిని కాకుండా చేసేందుకు అన్ని వ్యూహాలతో సిద్ధంగా ఉంది. తాజాగా థర్డ్ ఫ్రంట్కు మద్దతిచ్చేందుకు కూడా సిద్ధమయింది. తాము అధికారంలోకి రాలేమని.. మోడీ హవా ఉందని పరోక్షంగా లేదా అంతర్గతంగా కాంగ్రెసులో ఆందోళన, అలజడి కనిపిస్తోంది. తాము గెలువక పోయినప్పటికీ మోడీని మాత్రం గద్దె పైన కూర్చోనీయకుండా చేయాలని అడుగులు వేస్తోంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం చోటు చేసుకునే పొత్తు రాజకీయాల వల్ల నరేంద్ర మోదీకి ప్రధాని పదవి దక్కే అవకాశాలు ఉండవని, థర్డ్ ఫ్రంట్లో చేరి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని పృథ్వీరాజ్ అన్నారు. అవసమైతే తాము మూడో కూటమికి మద్దతిస్తామని, మోడీని మాత్రం ప్రధానిని కానీయమన్నారు.
కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలను బిజెపి దక్కించుకున్నా మోడీకి ప్రధాని పదవి అందకుండా పోతుందన్నారు. థర్డ్ ఫ్రంట్తో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని, ఇంతకు మించి మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. లౌకికశక్తులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా కాంగ్రెస్కే ఉందన్నారు. లోకసభ ఎన్నికల్లో కొత్త ఓటర్ల సంఖ్య పెరిగినందునే పోలింగ్ శాతం పెరిగిందని, ఇందుకు మోడీ ప్రభంజనం కారణం కాదన్నారు.