పార్టీ నేతలతో ప్రియాంక గాంధీ భేటీ: రాహుల్ గైర్హాజరు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం పార్టీ ముఖ్య నేతలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రకటిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సమావేశం కూడా రాహుల్ గాంధీ నివాసంలోనే జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రి జైరాం రమేష్, సీనియర్ నేత జనార్ధన్ ద్వివేది, ఇతర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరుకానట్లు పార్టీ వర్గాలు ద్వారా తెలిసింది.
జనవరి 17న జరిగే ఏఐసిసి సమావేశంలో రాహుల్ గాంధీని తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకొంది. సమావేశంలో కూడా ఈ అంశంపైనే చర్చించినట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.
పార్టీలో అంతర్గత మార్పులపై కూడా చర్చించినట్లు సమాచారం. కాగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయరని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఆమె పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు వారంటున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసిసి సమావేశాలకు ముందే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత మార్పులుండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.