జస్టిస్ లోయా కేసు: రాష్ట్రపతికి రాహుల్ గాంధీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: సిబిఐ కోర్టులో జడ్జిగా పనిచేస్తూ మరణించిన జస్టిస్ బ్రిజ్గోపాల్ హర్కిషన్ లోయా కేసు విషయమై విపక్షపార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో శుక్రవారం నాడు రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ను కలిశారు. జస్టిస్ లోయా మృతిపై అనుమానాలున్న విషయాన్ని విపక్షపార్టీల నేతలు రాష్ట్రపతి వద్ద ప్రస్తావించారు.
లోయా మృతిపై సిట్తో కేసు దర్యాప్తు జరిపించాలని రాహుల్ గాంధీ, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. లోయా మృతిపై ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పారు. కేసును తప్పుదోవ పట్టించే యత్నాలు జరుగుతున్నాయని విపక్ష నేతలు రామ్నాథ్ కోవింద్కు వివరించారు.
జస్టిస్ లోయా మృతిపై 15 పార్టీలకు చెందిన 114 మంది ఎంపీలు సంతకాలు చేసిన పిటిషన్ను రాష్ట్రపతి కోవింద్కు అందజేసినట్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు..13 పార్టీలకు చెందిన నేతలు సిట్ విచారణకు ఆదేశించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశామన్నారు.. జస్టిస్ లోయా మృతితో పాటు మరో కేసుల్లో అనుమానాలున్నాయని రాహుల్ గాంధీ చెప్పారు.. విచారణ కోసం తాము చేసిన విజ్ఞప్తిపై రాష్ట్రపతి కోవింద్ సానుకూలంగా స్పందించారని రాహుల్ వివరించారు.
మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిందితుడిగా ఉన్న సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తుండగానే 2014 డిసెంబర్ 1న లోయా అనుమానాస్పద స్థితిలో గుండెపోటుతో మరణించాడు. జస్టిస్ లోయా కేసు విచారించనున్న ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వం వహించనున్నారు. అంతకుముందు ఈ బెంచ్లో ఉన్న జస్టిస్ అరుణ్ మిశ్రాను పక్కకు తప్పించారు.