కేంద్రం.. గుట్టు చప్పుడు కాకుండా
CAA: దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు హింసాత్మక పరిస్థితులు, దాడులు, నిరసన ప్రదర్శనలకు దారి తీసిన అత్యంత వివాదాస్పద యాక్ట్.. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం. ఇది మరోసారి తెర మీదికి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తుదిదశకు చేరుకున్న వేళ.. వివాదాలకు తెర తీసినట్టయింది.
జూన్ 1వ తేదీన చివరి విడత అంటే ఏడో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగాల్సిన ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం.. గుట్టు చప్పుడు కాకుండా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం కొరుకుడు పడని విధంగా తయారైన పశ్చిమ బెంగాల్లో దీన్ని మొట్టమొదటిసారిగా అమలు చేసింది.

ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం రూల్స్ 2024 ప్రకారం ధృవీకరణ పత్రాలను మంజూరు చేసే ప్రక్రియ పశ్చిమ బెంగాల్ ప్రారంభించినట్లు వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ నుంచి దాఖలైన తొలి సెట్ దరఖాస్తులకు నేడు పశ్చిమ బెంగాల్ సాధికార కమిటీ సర్టిఫికెట్లను మంజూరు చేసినట్లు పేర్కొంది.
హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సాధికార కమిటీలు కూడా సీఏఏ రూల్స్ ప్రకారం- దరఖాస్తుదారులకు పౌరసత్వ సర్టిఫికెట్లను మంజూరు చేశాయి. క్రమంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇది అమలులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు దీన్ని తాము అమలు చేయబోమంటూ అసెంబ్లీలో తీర్మానించిన విషయం తెలిసిందే
పౌరసత్వ సవరణ చట్టాన్ని ఈ ఏడాది మార్చి 11వ తేదీన నోటిఫై చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం- సీఏఏ నిబంధనల కింద దాఖలయ్యే దరఖాస్తులను పరిశీలించడానికి, వాటిని ప్రాసెస్ చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జిల్లా, రాష్ట్ర స్థాయి సాధికార కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ ద్వారా ఆ దరఖాస్తులను పరిశీలించి పౌరసత్వ సర్టిఫికెట్లను మంజూరు చేయొచ్చని సిఫారసు చేస్తాయి. దరఖాస్తుల ప్రాసెసింగ్ పూర్తిగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా జరుగుతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు వలస వచ్చిన హిందూ, సిక్, జైన, బౌద్ధ, పార్సీ, క్రైస్తవ సామాజిక వర్గాలకు పౌరసత్వాన్ని కల్పించడం దీని ఉద్దేశం. ఆయా దేశాల నుంచి భారత్కు వచ్చిన ముస్లింలకు ఇది వర్తించదు.












Click it and Unblock the Notifications