30% కమీషన్: రూ.కోట్ల బ్లాక్ మనీ వైట్ చేస్తూ బిల్డర్ అరెస్టు
ముంబై: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాతనోట్లు రద్దు ప్రభావం నల్లధనం దాచుకున్న వారి మీద పడటంతో వారు అడ్డదార్లో రూ.1,000, రూ.500 నోట్లు మార్చుకోవడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కైపోతున్నారు.
తాజాగా పూణేలోని ఓ ప్రముఖ బిల్డర్ తన దగ్గర ఉన్న పాత నోట్లను 30 శాతం కమీషన్ చెల్లించి వైట్ మనీగా మార్చుకోవడానికి ప్రయత్నించడంతో క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. పూణేలో అంకేష్ ఆనంద్ అగర్వాల్ అనే బిల్డర్ నివాసం ఉంటున్నాడు.
ఈయన పూణేలో పేరుమోసిన బిల్డర్. ఈయన తన వద్ద ఉన్న రూ.1.11 కోట్లు (రూ.1,000, రూ.500 నోట్లు) వైట్ మనీగా మార్చుకోవడానికి సిద్దం అయ్యారు. అందుకు 30 శాతం కమీషన్ ( రూ. 100 కు రూ.30 ) ఇవ్వడానికి మరో వ్యాపారితో ఒప్పందం చేసుకున్నాడు.
పూణే కార్పొరేషన్ సమీపంలోని నాకోడా కోర్టు బిల్డింగ్ లోని కిషోర్ పోర్వాల కార్యాలయంలో రూ. 1.11 కోట్ల పాత నోట్లు తీసుకు వెళ్లి కొత్త నోట్లు తీసుకోవడానికి ప్రయత్నించడంతో పూణే క్రైం బ్రాంచ్ పోలీసులు అంకేష్ ఆనంద్ అగర్వాల్ ను అరెస్టు చేశారు.
ఇతనితో పాటు కొత్త నోట్లు ఇవ్వడానికి ప్రయత్నించిన మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 1.11 కోట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న రూ.1.11 కోట్లను ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.