రాత్రికి రాత్రే ఐటీ కంపెనీ క్లోజ్.. రోడ్డున పడ్డ 700 మంది ఉద్యోగులు!
మహారాష్ట్రలోని పుణె ఐటీ హబ్లో ఓ దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. 'థింక్ టెక్నాలజీ ఇండియా' అనే ఐటీ సంస్థ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా రాత్రికి రాత్రే తన కార్యకలాపాలను నిలిపివేసింది. దీంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కొత్తగా ఉద్యోగాల్లో చేరిన గ్రాడ్యుయేట్లు, ఇంటర్న్లతో కలిపి దాదాపు 700 మందికి పైగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. జీతాలు ఇవ్వకపోవడం, ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడం, నిధుల దుర్వినియోగానికి పాల్పడటం వంటి ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి సదరు సంస్థ సీఈవోను చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు.
పుణెలోని హింజేవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైంది. ఒక 25 ఏళ్ల ఇంటర్న్ (శిక్షణలో ఉన్న ఉద్యోగి) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించగా.. ఇప్పటివరకు 30 మందికి పైగా ఉద్యోగులు తమకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో కంపెనీ సీఈఓతో పాటు హెడ్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ (HR) మేనేజర్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏప్రిల్ నెలలోనే కంపెనీ అకస్మాత్తుగా కార్యకలాపాలను నిలిపివేసిందని, ఆఫీసుకు తాళాలు వేసి ఉండటంతో పాటు యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాము మోసపోయామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంస్థ 2025లో కార్యకలాపాలను ప్రారంభించింది. ఉద్యోగులు, ఇంటర్న్లను చేర్చుకునే సమయంలో లాప్టాప్లు, ఆన్బోర్డింగ్ ప్రక్రియల పేరుతో ఒక్కొక్కరి నుండి రూ. 15,000 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రారంభంలో నమ్మకం కలిగించడానికి కొందరికి జీతాలు, స్టైపెండ్లు సక్రమంగానే చెల్లించినప్పటికీ.. 2026 జనవరి నెల నుంచి జీతాల చెల్లింపులను పూర్తిగా నిలిపివేసింది. బకాయిల కింద ఇచ్చిన చెక్కులు కూడా బ్యాంకుల్లో బౌన్స్ కావడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. కంపెనీ ఆర్థిక పరిస్థితిపై నిలదీసిన ప్రతిసారీ ఇంటర్నల్ ఆడిట్ జరుగుతోందని, ఫండింగ్ ఆలస్యమవుతోందని త్వరలోనే జీతాలు ఇస్తామని యాజమాన్యం కాలయాపన చేస్తూ వచ్చింది.
మరోవైపు శిక్షణ సమయంలో ఇంటర్న్లకు ఇస్తామన్న లాప్టాప్లు గానీ, స్టైపెండ్ గానీ అందలేదని బాధితులు పేర్కొంటున్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన ఉద్యోగులు ఏప్రిల్ 20న పుణె పోలీసులను ఆశ్రయించి తమ బకాయిలను ఇప్పించాలని కోరారు. అలాగే కార్మిక శాఖ అధికారులకు కూడా ఫిర్యాదులు చేశారు. పాత ఉద్యోగుల డిపాజిట్ సొమ్మును కంపెనీ అవసరాలకు వాడుకుంటూనే.. కొత్తగా మరికొంత మందిని రిక్రూట్ చేసుకుంటూ యాజమాన్యం మోసాలకు పాల్పడిందని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు కంపెనీ ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications