సోను సూద్ పొలిటికల్ ఎంట్రీ: కేజ్రీవాల్తో భేటీ
న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు సోను సూద్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయమైందా? ఆమ్ ఆద్మీ పార్టీ తీర్థాన్ని ఆయన పుచ్చుకోనున్నారా? వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది.. దేశ రాజధానిలో. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోను సూద్ తాను స్వయంగా పోటీ చేయడం లేదా.. తన చెల్లెలిని ఎన్నికల బరిలో దించడం ఖాయంగా కనిపిస్తోందనే ప్రచారం ఊపందుకుంది.

తీర్థం పుచ్చుకుంటారా?
ఈ కారణంతోనే ఆయన ఈ మధ్యాహ్నం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలుసుకోనున్నారు. సోను సూద్ స్వరాష్ట్రం పంజాబ్. మోగా ఆయన స్వస్థలం. అనంతరం బాలీవుడ్లో అవకాశాలను వెదుక్కుంటూ ఆయన ముంబై బాట పట్టారు. హిందీ సినిమాలతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పేద కుటుంబాలకు ఆయన చేసిన సహాయం, విరాళాలు, దానాల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే అవుతుంది.

ఇదివరకే వార్తలొచ్చినా..
ఇదివరకు సోను సూద్ రాజకీయాల్లో ప్రవేశిస్తారని, శివసేనలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అవేవీ వాస్తవ రూపాన్ని దాల్చలేకపోయాయి. అందరూ ఊహించినట్టుగా ఆయన రాజకీయాల్లో చేరలేదు. రాజకీయాలపై తనకు ఆసక్తి కూడా లేదంటూ సోను సూద్ ఓ సందర్భంలో స్పష్టం చేశారు కూడా. తాజాగా- ఆయన మనసు మార్చుకున్నట్టే కనిపిస్తోంది. రాజకీయాలపై ఆసక్తిగా ఉందనే విషయాన్ని ఆయన చెప్పకనే చెబుతున్నారు.

ఎన్నికల ప్రచారానికి..
పంజాబ్ ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాల్లోనూ పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ దిశగా రాజకీయపరమైన కార్యక్రమాలను ముమ్మరం చేసింది. త్వరలో అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్లో పర్యటించనున్నారు కూడా. పార్టీకి చెందిన ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఈ పరిణామాల మధ్య సోను సూద్- ఢిల్లీ ముఖ్యమంత్రిని కలుసుకోబోతోండటం పట్ల అనేక ఊహాగానాలు చెలరేగుతోన్నాయి. సోను రాజకీయ రంగ ప్రవేశం దాదాపు ఖాయమైనట్టేననే వార్తలు వస్తోన్నాయి.

పంజాబ్ బ్రాండ్ అంబాసిడర్గా..
ప్రస్తుతం ఆయన పంజాబ్లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సారథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తమ ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాలను ప్రచారం చేయడానికి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అమరీందర్ సింగ్ సర్కార్.. ఆయనను ప్రచారకర్తగా నియమించుకుంది. ఒకరకంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో సోనూ సూద్కు సత్సంబంధాలే ఉన్నాయి.

రాజకీయ కోణంలోనే..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్తో సోను సూద్ భేటీ కావడాన్ని రాజకీయ కోణంలోనే చూస్తోన్నారు విశ్లేషకులు. ప్రస్తుతం వ్యక్తమౌతోన్న అభిప్రాయాలు, అంచనాలకు అనుగుణంగా సోనూ గనక ఆమ్ ఆద్మీ పార్టీ తీర్థాన్ని పుచ్చుకోగలిగితే.. కేజ్రీవాల్ అదృష్టవంతుడేననే వాదనలు లేకపోలేదు. పంజాబ్ వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన నాయకుడు లేడు. సోను సూద్ ద్వారా కేజ్రీవాల ఆ కొరతను తీర్చుకునే ప్రయత్నం చేస్తారని అంటున్నారు.
Recommended Video

సద్వినియోగం చేసుకుంటారా?
సోను సూద్ స్వయంగా పోటీ చేయకపోయినప్పటికీ- తన సోదరిని ఎన్నికల బరిలో దించడానికి ప్రయత్నిస్తోన్నారని, ఆ కారణంతోనే ఆయన కేజ్రీవాల్ను కలుసుకుంటున్నారనే ప్రచారం సైతం సాగుతోంది. ఈ రెండింట్లో ఏది వాస్తవం అనే విషయం ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది. సోనూ రాజకీయ రంగ ప్రవేశానికి ఇదే సరైన సమయమని, దాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటారనే విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు.












Click it and Unblock the Notifications