రాఫెల్ ట్విస్టు: ఓ వైపు అధికారిక చర్చలు.. మరోవైపు పీఎంఓ ఎంట్రీ.. ఏంజరుగుతోంది?
దేశాన్ని కుదిపేస్తోన్న రాఫెల్ విమాన కొనుగోలు అంశం మరో మలుపు తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడీ బృందం ఓ వైపు ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరపుతూనే అదే సమయంలో మరొకరితో చర్చలు జరిపారని ప్రముఖ జాతీయ దినపత్రిక వెల్లడించింది. దీంతో మరోసారి రాఫెల్ అంశం వివాదాస్పదంగా మారుతోంది.
పీఎంఓ ఎవరితో చర్చలు జరిపింది..?
రాఫెల్ యుద్ధ విమాన కొనుగోలు అంశం మరో మలుపు తీసుకుంది. ఫ్రాన్స్ ప్రభుత్వంతో విమానాల కొనుగోలుకు చర్చలు జరుపుతున్న సమయంలోనే... ఫ్రాన్స్ ప్రభుత్వంలోని మరొకరితో చర్చలు జరిపినట్లు ఓ జాతీయ దినపత్రిక ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. అయితే ఆసమయంలో మరొకరితో చర్చలు జరపడాన్ని రక్షణశాఖ 2015లోనే తప్పుబట్టినట్లు పత్రిక కథనంలో పేర్కొంది. ఆ సమయంలో ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు.
ప్రధాని కార్యాలయం నుంచి ఎవరు మాట్లాడారు..?
పారికర్కు రక్షణ మంత్రిత్వ శాఖ 2015 నవంబర్ 24వ తేదీనా లేఖ రాసిందని కథనంలో పేర్కొంది. రాఫెల్కు సంబంధించి మరొకరితో ప్రధాని కార్యాలయం చర్చలు జరుపుతోందని అలా అయితే రక్షణశాఖ చేస్తున్న చర్చలు బలహీనపడే అవకాశాలున్నాయని తెలుపుతూ పారికర్కు లేఖ రాసింది. రాఫెల్ ధర చర్చలు జరుగుతున్న నేపథ్యంలో భారత బృందంలో లేనివారు ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరపరాదని చెబుతూ ప్రధాని కార్యాలయానికి రక్షణశాఖ తెలిపింది. ఒకవేళ రక్షణ శాఖ చేపడుతున్న చర్చలపై ప్రధాని కార్యాలయానికి నమ్మకం లేకుంటే ప్రధాని కార్యాలయమే ఎవరు చర్చ జరపాలన్నది నిర్ణయించాలని రక్షణశాఖ పేర్కొన్నట్లు కథనంలో ప్రచురించింది. ఇదిలా ఉంటే ఆంగ్ల పత్రిక ఢిఫెన్స్ కార్యాలయం నుంచి ఓ నోట్ను పొందింది. రక్షణశాఖ జరుపుతున్న చర్చల్లో ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోకుంటే బాగుంటుందని స్వయంగా నాటి రక్షణ కార్యదర్శిగా ఉన్న జి. మోహన్ కుమార్ చెప్పినట్లు ఆ నోట్లో ఉంది. ఈ నోట్ను డిప్యూటీ సెక్రటరీ ఎస్కే శర్మ తయారు చేయగా... రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారు.
ఫ్రాన్స్ లేఖతో బయటపడ్డ వ్యవహారం
ఇక ప్రధాని కార్యాలయం మరొకరితో రాఫెల్పై చర్చలు జరుపుతున్నారన్న విషయం ఫ్రాన్స్ బృందం వారు లేఖ రాయడంతో వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 23, 2015న చర్చల్లో పాల్గొంటున్న ఫ్రాన్స్ బృందంలో ఒకరైన జనరల్ స్టీఫెన్ రెబ్ రక్షణశాఖకు లేఖ రాశారు. ఇందులో ప్రధాని కార్యాలయం మరొకరితో చర్చలు జరుపుతోందని ఆయన చెప్పారు. లేఖ రాయడానికి మూడు రోజుల ముందు ప్రధాని కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా ఉన్న జావెద్ ఆష్రాఫ్.. ఫ్రెంచ్ డిఫెన్స్లో అధికారిగా ఉన్న లూయిస్ వాసీతో ఫోనులో చర్చలు జరిపినట్లు సమాచారం. ఆ తర్వాతే జనరల్ స్టీఫెన్ రెబ్ ప్రధాని కార్యాలయానికి లేఖ రాయడం జరిగిందని కథనం పేర్కొంది. ఇక చర్చల్లో పాల్గొంటున్న భారత బృందానికి నాయకత్వం వహిస్తున్న ఎయిర్ మార్షల్ ఎస్బీపీ సిన్హా అష్రాఫ్కు లేఖ రాశారు. లేఖ రాసిన రెండు వారాలకు తాను ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు ఆష్రాఫ్ అంగీకరించారు.
అజిత్ దోవల్ పాత్ర కూడా ఉందా..?
ఇలా మరొకరితో రాఫెల్పై చర్చలు జరపడం తొలిసారి కాదు. 2016 డిసెంబరులో దేశ భద్రత సలహాదారుడు అజిత్ దోవల్ కూడా ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆయన చర్చలు జరిపే బృందంలో సభ్యుడు కానప్పటికీ చర్చలు ఎందుకు జరపాల్సి వచ్చిందనేదానిపై అనుమానాలు బలపడుతున్నాయి. దోవల్ ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరిపారన్నదానికి రుజువులు ఉన్నట్లు జాతీయదిన పత్రిక తెలిపింది. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టుకు రాఫెల్ అంశంలో సమర్పించిన అఫిడవిట్లో దోవల్ పేరు చేర్చలేదని కూడా కథనం రాసుకొచ్చింది.
ఇదిలా ఉంటే రాఫెల్లో అవినీతి జరిగిందని ముందునుంచి కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. తన స్నేహితుడు అనిల్ అంబానికి లబ్ధి చేకూర్చేందుకే యూపీఏ ఒప్పందాన్ని రద్దు చేసి కొత్త ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు రాహుల్ గాంధీ. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేనిపోని ఆరోపణలు నెట్టి దేశ రక్షణ రంగం బలోపేతం కాకుండా కాంగ్రెస్అడ్డుపడుతోందని ప్రధాని మోడీ గురువారం లోక్సభలో మండిపడ్డారు.