ఎందుకమ్మా.. ఈ డుమ్మా?
Rahul Gandhi: జమిలి ఎన్నికలు రావొచ్చనే ప్రచారం దేశంలో విస్తృతంగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చుట్టూ సరికొత్త వివాదాలు ముసురుకుంటోన్నాయి. ఈ వివాదాలు- చేతులారా చేసుకుంటోన్నవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ మధ్యకాలంలో రాహుల్ గాందీ కొన్ని జాతీయ స్థాయి అతి పెద్ద కార్యక్రమాలకు దూరంగా ఉంటోండటం.. వాటిల్లో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. వంటివి ఈ జాబితాలో ఉండటం చర్చనీయాంశమౌతోంది.

రాహుల్ గాంధీ నాయకత్వం, దేశం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతపై ఇతరులు ప్రశ్నించడానికి అవకాశం ఇచ్చినట్టయింది. మహా కుంభ మేళా విషయానికొస్తే ఈ మహత్తర కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి కోట్లాదిమంది భక్తులు త్రివేణి సంగమ స్నానాన్ని ఆచరిస్తోన్నారు.
దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే అత్యంత అరుదైన సందర్భంగా ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనానికి చిహ్నం ఇది. దీన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు విస్తృతంగా వినియోగించుకుంటోన్నారు. ఇందులో భాగస్వామ్యులవుతున్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఇటీవలే తన మంత్రివర్గ సమావేశాన్ని త్రివేణి సంగమం ఘాట్ వద్ద నిర్వహించిన విషయం తెలిసిందే. మంత్రులందరూ ఇందులో పాల్గొన్నారు. అనంతరం సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీకి చెందిన సీనియర్లు మహా కుంభమేళాలో పాలుపంచుకొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పవిత్ర స్నానాలను ఆచరించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారావుతోంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోన్నారు. దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని పూర్తిగా విస్మరించారు.
జన్మతః బ్రాహ్మణుడినని చెప్పుకొంటోన్నప్పటికీ- వినాయక చవితి, దేవీ నవరాత్రుల వంటి ప్రధాన పండగలకూ దూరంగా ఉంటోన్నాడంటూ గతంలోనే విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దేశ ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చే ఇలాంటి కార్యక్రమాలు, సందర్భాల పట్ల నిర్లక్ష్యంగా, వాటితో తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం పట్ల ఈ విమర్శల తీవ్రత నానాటికీ పెరుగుతోంది.

అయోధ్యలో రామమందిర భూమి పూజకూ రాహుల్ గాంధీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. ఆలయ ప్రతిష్ఠాపనకు కాంగ్రెస్ నాయకత్వం ఉద్దేశపూరకంగా దూరంగా ఉందనే అభిప్రాయాలు అప్పట్లో విస్తృతంగా వినిపించాయి కూడా. కీలకమైన సాంస్కృతిక ఘట్టాలను చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్ల ప్రజలతో డిస్ కనెక్ట్ అయ్యారనే విమర్శలు లేకపోలేదు.
తాజాగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ ఆయన పాల్గొనలేదు. దేశ ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్య సమర యోధులు, అమర వీరుల త్యాగాలను స్మరించుకునే ఈ ఉత్సవాలకూ దూరం అయ్యారు రాహుల్ గాంధీ. పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే సైతం రిపబ్లిక్ డే పరేడ్కు గైర్హాజర్ అయ్యారు. ఇది ప్రజాస్వామ్య విలువలు, సాయుధ దళాల పట్ల వారికి ఉన్న గౌరవం ఏపాటిదో తెలియజేసినట్టయింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షేత్రస్థాయిలో వరద బాధిత ప్రాంతాలను సందర్శించి, బాధితులు- సైనికులను నేరుగా కలుస్తోన్న సందర్భాల్లో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేశారనే విమర్శలు ఎటూ ఉండనే ఉన్నాయి. జాతీయ స్థాయి సంక్షోభ సమయాల్లో ఆయన అందుబాటులో లేకపోవడం నాయకత్వ లక్షణాలు, దేశం పట్ల ఉన్న బాధ్యతలపై సందేహాలను లేవనెత్తినట్టయింది.
నిజానికి- రాహుల్ గాంధీ సంవిధాన్ దీక్ష కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోన్నారు. తనను తాను రాజ్యాంగ పరిరక్షకుడిగా అభివర్ణించుకుంటోన్నారు. అధికారిక కార్యక్రమాలకు మాత్రం హాజరు కాకూడదని నిర్ణయించుకోవడం విమర్శలకు తెర తీసింది. గతంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును పలకరించడంలో ఇష్టపడలేదని, దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా ఉన్న రాజ్యాంగం, రాజ్యాంగ విలువల పట్ల ఉదాసీనంగా ఉంటోన్నారనే ఆరోపణలు లేకపోలేదు రాహుల్ గాంధీపై.
జాతీయ కార్యక్రమాలకే కాదు- కాంగ్రెస్ అంతర్గత వేడుకలను కూడా ఆయన విస్మరించడం విస్మయానికి గురి చేస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లల్లో పార్టీ నిర్వహించిన విజయోత్సవ వేడుకలకు హాజరు కాకపోవడం కార్యకర్తలను నిరుత్సాహానికి గురిచేసింది. ఇది- ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించినట్టయింది. కీలకమైన జాతీయ కార్యక్రమాలకు రాహుల్ గాంధీ పదేపదే గైర్హాజరవడం యాదృచ్ఛికం కాదు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ మొదట బలంగా కనిపించింది. ప్రచారం సాగుతున్న కొద్దీ- రాహుల్ గాంధీ సహా కీలక నేతలు డుమ్మా కొట్టడంతో కార్యకర్తలు డీలా పడ్డారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహా కుంభమేళా, గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఢిల్లీ ఎన్నికల పోరు నుంచి ఆయన ఎందుకు మిస్సయ్యారనేది ప్రశ్నార్థకం.
దేశ అంతరాత్మగా చెప్పుకొనే జాతీయ కార్యక్రమాలు, దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసే మహా కుంభ మేళా వంటి అత్యంత పవిత్రమైన సాంస్కృతిక, వారసత్వ సంప్రదాయాల నుండి తనను తాను దూరం చేసుకునే నాయకుడు నిజంగా ఈ దేశాన్ని నడిపించగలడా? అనే ప్రశ్న తలెత్తుతోంది.












Click it and Unblock the Notifications